‘‘చావుకు నేను భయపడలేదు. కానీ, అప్పుడు నా కోరిక ఒకటే. యుద్ధంలో మనం గెలవాలి. చనిపోవడానికి ముందు ‘టైగర్ హిల్’పై తిరిగి మన త్రివర్ణ పతాకం ఎగిరేలా చేయాలి’’.. ఓ సైనికుడి మనసులోని మాటలకు అక్షర రూపమిది. అది కార్గిల్ యుద్ధం.. ఆ వీరుడు యోగేంద్ర సింగ్ యాదవ్. ఆ యోధుడి పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చెప్తుంది ‘ది హీరో ఆఫ్ టైగర్ హిల్’ పుస్తకం. భారత అత్యున్నత సైనిక పురస్కారం ‘పరమవీర చక్ర’ పొందిన చిన్నవయసువాడిగా రికార్డుకెక్కిన యోగేంద్ర సింగ్ యాదవ్ జీవితచరిత్ర ఇది. ఈ పుస్తకాన్ని రాసింది కూడా ఆయనే. ఈ పుస్తకంలో బాల్యం, సైన్యంలో చేరడం, కార్గిల్వార్ అనే మూడు చాప్టర్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లాలో ఉన్న ఒక మారుమూల గ్రామంలో పుట్టాడు యోగేంద్ర. తండ్రి రిటైర్డ్ ఆర్మీ సిపాయి. చిన్నప్పుడు అన్నలతో కలసి యోగేంద్ర చేసిన అల్లరి, ఆడుకున్న ఆటలు, పొలం పనులు, ఇంట్లో తండ్రి చెప్పిన క్రమశిక్షణ పాఠాలు.. మొదటి చాప్టర్లో కనిపిస్తాయి. తండ్రి బాటలో నడిచేందుకు సిద్ధమవడం నుంచి సైన్యంలో చేరడం వరకు పడిన కష్టం రెండో భాగంలో ఉంది. అసలైనది, ఆఖరుది ఉత్కంఠతతో చదివించేది మూడో భాగమైన ‘కార్గిల్ వార్’. వేల అడుగుల ఎత్తులోని టైగర్హిల్పై శత్రుసైనికులతో యోగేంద్ర, మరికొందరు భారత సైనికులు చేసిన వీరోచిత పోరాటం ఇందులో కనిపిస్తుంది.
అప్పటికి యోగేంద్రకు 19 ఏండ్లు. భారత ఆర్మీలోని ఘాతక్ ప్లటూన్కు చెందిన 18 గ్రెనేడియర్స్ రెజిమెంట్లో పనిచేస్తున్నాడు. దొడ్డిదారిన, అక్రమంగా వచ్చి కార్గిల్ సెక్టార్లోని టైగర్ హిల్పై తిష్ట వేసిన పాక్ సైన్యాన్ని తరిమికొట్టేందుకు రంగంలోకి దిగింది యోగేంద్ర ఉన్న టీమ్. అప్పటికే టోలోలింగ్ పర్వతం దగ్గర ఉన్న పాక్ సైనికులను తుదముట్టించి వచ్చింది ఈ టీమ్. కానీ, ఈసారి శత్రు సైనికులు ఎత్తైన చోట ఉండడంతో వాళ్లను ఎదుర్కోవడం అంత సులభం కాదు. ముందు వెళ్లేవాళ్లు శత్రువుల తుపాకీలకు టార్గెట్ అవుతారు. అలాంటి పరిస్థితుల్లో తానే ముందు నడిచాడు యోగేంద్ర. బుల్లెట్ దెబ్బలు తగులుతున్నా, గ్రెనేడ్ పేలుళ్లలో ఎగిరిపడుతున్న రాళ్లు, రప్పలు తగులుతున్నా లెక్కచేయలేదు. చివరికి తాను అనుకున్నది సాధించాడు. యుద్ధంలో తన టీమ్లోని అందరూ చనిపోయినా, తుదివరకు పోరాడి భారత జెండాను ఎగరేశాడు. తీవ్రంగా గాయపడిన యోగేంద్ర ఆరునెలల పాటు మంచానికే పరిమితమయ్యాడు. ఆ తర్వాత సైన్యం నుంచి రిటైర్ అయ్యాడు. అతని పోరాటాన్ని గుర్తించిన ప్రభుత్వం ‘పరమవీర చక్ర’తో సత్కరించింది. ఆంగ్లంలో వచ్చిన ‘ది హీరో ఆఫ్ టైగర్ హిల్’ పుస్తకంలోని భాష అందరికీ సులువుగా అర్థమయ్యేలా ఉంది. కానీ, అక్షరదోషాలు ఇబ్బంది పెడతాయి.
::: సాయిప్రేమ్