- గత నాలుగు సెషన్లలో 2,100 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- రూ. 7 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
- తగ్గిన ఎఫ్ఐఐల అమ్మకాలు.. షేర్లను కొనుక్కోవడానికి ఇదే మంచి టైమ్ అంటున్న ఎనలిస్టులు
బిజినెస్ డెస్క్, వెలుగు: దేశ స్టాక్ మార్కెట్లు వరసగా నాలుగో సెషన్లోనూ లాభపడ్డాయి. గ్లోబల్ మార్కెట్లు పాజిటివ్గా ట్రేడవ్వడంతో పాటు లోకల్గా కూడా ప్రభుత్వం విండ్ఫాల్ ట్యాక్స్ను తగ్గించడంతో ఇండెక్స్లు బుధవారం దూసుకుపోయాయి. ప్రభుత్వం లోకల్గా ఉత్పత్తి అయ్యే క్రూడాయిల్పై విధించిన విండ్ఫాల్ ట్యాక్స్ను 27 శాతం తగ్గించింది. దీంతో హెవీ వెయిట్ షేరు రిలయన్స్ ఇండస్ట్రీస్ బుధవారం 3 శాతం పైగా పెరిగింది. రిలయన్స్ షేరు పెరగడంతో పాటు డాలర్ మారకంలో రూపాయి కొద్దిగా బలపడడం, విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి ఇండియన్ మార్కెట్లో నికర కొనుగోలు దారులుగా మారడంతో బెంచ్మార్క్ ఇండెక్స్లు బుధవారం కీలక లెవెల్స్ను క్రాస్ చేశాయి. సెన్సెక్స్ 630 పాయింట్లు (1.15 శాతం) పెరిగి 55,398 వద్ద ముగిసింది. నిఫ్టీ 180 పాయింట్లు లాభపడి కీలకమైన 16,500 లెవెల్ను క్రాస్ చేసింది. ఒకానొక దశలో 16,590 వరకు పెరిగిన ఈ ఇండెక్స్, చివరికి 16,521 వద్ద క్లోజయ్యింది.
మార్కెట్ పెరుగుతున్నా..జాగ్రత్త!
మార్కెట్లు గత నాలుగు సెషన్ల నుంచి పెరుగుతూ వస్తున్నాయి. సెన్సెక్స్ ఈ టైమ్లో 2,100 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 600 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 900 పాయింట్లు, నిఫ్టీ స్మాల్క్యాప్ 100 ఇండెక్స్ 350 పాయింట్లు లాభపడింది. దీని బట్టి కేవలం పెద్ద షేర్లలోనే కాకుండా చిన్న షేర్లలో కూడా బయ్యింగ్ వచ్చిందనే విషయం అర్థమవుతోంది. ఈ నాలుగు సెషన్లలో బీఎస్ఈలోని కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 7 లక్షల కోట్లు పెరగడం గమనించాలి. గత రెండు వారాల నుంచి మార్కెట్లో వోలటాలిటీ తగ్గుతూ వస్తోందని యాక్సిస్ సెక్యూరిటీస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ నవీన్ కులకర్ణి అన్నారు. కానీ, యూరప్ అనేక సమస్యలను ఎదుర్కొంటోందని, వీటిని జాగ్రత్తగా గమనించాలని సలహాయిచ్చారు. ముఖ్యంగా రష్యా నుంచి యూరప్ దేశాలకు గ్యాస్ సప్లయ్ తిరిగి ప్రారంభమవుతుందో లేదో గమనించాలని అన్నారు. రష్యా నుంచి గ్యాస్ సప్లయ్ ఆగిపోతే యూరప్లో ఇన్ఫ్లేషన్ మరింత పెరుగుతుంది. ఇప్పటికే యూకేలో ఇన్ఫ్లేషన్ 40 ఏళ్ల గరిష్టమైన 9.4 శాతానికి జూన్లో చేరుకుంది. విదేశీ ఇన్వెస్టర్ల నుంచి అమ్మకాల ఒత్తిడి తగ్గడంతో ఇన్వెస్టర్లు మెల్ల మెల్లగా షేర్లలో ఇన్వెస్ట్ చేయడం పెంచాలని కులకర్ణి సలహాయిచ్చారు. గ్లోబల్ మార్కెట్ల పరంగా చూస్తే, టోక్యో, హాంకాంగ్, షాంఘై, సియోల్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. యూరప్ మార్కెట్లు మాత్రం నష్టాల్లో ముగిశాయి.
మార్కెట్ పెరగడానికి కారణాలు..
1యూఎస్ మార్కెట్లో జోష్..
బ్యాంక్ల క్వార్టర్లీ రిజల్ట్స్ బాగుండటంతో యూఎస్ మార్కెట్లు గత కొన్ని సెషన్ల నుంచి లాభపడుతున్నాయి. దీనివల్ల వడ్డీ రేట్లను యూఎస్ ఫెడ్ మరీ ఎక్కువగా పెంచదని, మానిటరీ పాలసీని కఠినతరం చేయదని మార్కెట్లు అంచనావేస్తున్నాయి. మంగళవారం సెషన్లో యూఎస్ మార్కెట్లు 2 శాతానికి పైగా పెరిగాయి. ఈ ఎఫెక్ట్తో ఆసియా మార్కెట్తో పాటు మన మార్కెట్ బుధవారం లాభపడింది.
2 రష్యా గ్యాస్ సప్లయ్..
నార్డ్ స్ట్రీమ్ 1 పైప్ లైన్ ద్వారా డైరెక్ట్గా రష్యా నుంచి జర్మనీకి గ్యాస్ సప్లయ్ అవుతోంది. మెయింటెనెన్స్ పేరుతో ఈ పైప్లైన్ను ఈ నెల 11 న రష్యా మూసేసింది. దీంతో యురప్లో చాలా దేశాల్లో గ్యాస్ కొరత పెరిగింది. ఫలితంగా ఇన్ఫ్లేషన్ ఎక్కువయ్యింది. షెడ్యూల్ ప్రకారమే ఈ పైప్లైన్ గురువారం తిరిగి ఓపెన్ అవుతుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో మార్కెట్లో సానుకూలత పెరిగింది.
3 డాలర్ పతనం.. విదేశీ ఇన్వెస్ట్మెంట్లు
విదేశీ ఇన్వెస్టర్లు మంగళవారం నికరంగా రూ.976.4 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. యూరో బలపడడంతో డాలర్ వాల్యూ బుధవారం తగ్గింది. దీంతో రూపాయి కొద్దిగా పెరిగి 79.98 వద్ద సెటిలయ్యింది.
తగ్గిన విండ్ఫాల్ ట్యాక్స్..
గ్లోబల్గా క్రూడాయిల్ రేట్లు దిగిరావడంతో మూడు వారాల కిందట విధించిన ఎక్స్పోర్ట్ ట్యాక్స్ను, విండ్ఫాల్ ట్యాక్స్ను ప్రభుత్వం తగ్గించింది. పెట్రోల్పై ఎక్స్పోర్ట్ ట్యాక్స్ను పూర్తిగా తీసేయగా, డీజిల్, జెట్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ఎగుమతులపై విధించిన ట్యాక్స్ను లీటర్కు రూ. 2 మేర తగ్గించింది. దీంతో డీజిల్పై ఎక్స్పోర్ట్ ట్యాక్స్ లీటర్కు రూ. 11 కి తగ్గగా, ఏటీఎఫ్పై ఎక్స్పోర్ట్ ట్యాక్స్ రూ. 4 కి తగ్గింది. అంతేకాకుండా లోకల్గా ప్రొడ్యూస్ అయిన క్రూడాయిల్పై టన్నుకి రూ. 23,250 ని విండ్ఫాల్ ట్యాక్స్గా విధించిన ప్రభుత్వం, దీన్ని టన్నుకి రూ. 17,000 కు తగ్గించింది. ఆయిల్పై విధించిన వివిధ ట్యాక్స్లను ప్రభుత్వం తగ్గించడంతో, బుధవారం రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ, వేదాంత, చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ షేర్లు భారీగా
లాభపడ్డాయి.