మహారాష్ట్రలోని ఇటీవల ఓ ప్రైవేట్ బ్యాంకులో రూ.34 కోట్ల చోరీకి పాల్పడ్డ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంక్ లో క్యాష్ లాకర్ ఇన్ చార్జ్ అల్తాఫ్ షేక్ ప్రధాన నిందితుడని పోలీసులు తేల్చారు. అయితే అతను పరారీలో ఉన్నాడు. అతనికి సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ. 12.20 కోట్లను రికవరీ చేశారు. ఈ కేసులో పోలీసులు చెప్పిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
ఈ నెల 9న థానే జిల్లాలోని డోంబివలీ నగర మాన్ పడా ప్రైవేట్ బ్యాంకులో దొంగలు రూ. 34 కోట్లు ఎత్తుకెళ్లారు. అయితే డబ్బంతా బ్యాగ్ లలో నింపిన దొంగలు హడావుడిలో ఏడు బ్యాగ్ లను అక్కడే ఏసీ డక్ట్ లలో మర్చిపోయారు. మిగతా డబ్బుతో అక్కడి నుంచి చిన్న ట్రక్కులో పారిపోయారు.
జులై 11న డబ్బు చోరీ అయిందని గుర్తించిన బ్యాంకు అధికారులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించగా దొంగలు ఫుటేజ్ ను తారుమారు చేసినట్లు గుర్తించారు. దీంతో క్యాష్ ఉన్న గదిని పోలీసులు తనిఖీ చేయగా.. ఏసీ డక్ట్ లో ఏడు బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. అందులోని డబ్బును లెక్కించగా రూ. 22 కోట్లు ఉన్నట్లు గుర్తించారు. తర్వాత పక్క సమాచారంతో థానే క్రైం బ్రాంచ్ పోలీసులు .. సెల్ ట్రాప్ చేసి థానే జిల్లాలోని ముంబ్రాకు చెందిన ఇస్రార్ అబ్రార్ హుస్సేన్ ఖురేషీ (33), షంషాద్ అహ్మద్ రియాజ్ అహ్మద్ ఖాన్ (33), అనుజ్ ప్రేంశంకర్ గిరి (30)లను పట్టుకున్నారు. వీరి నుంచి రూ. 5.80 కోట్ల నగదు, 10 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ అధికారుల వివరాల ప్రకారం..బ్యాంక్ చోరీ జరిగిన రోజున క్యాష్ లాకర్ ఇన్ చార్జ్ గా అల్తాఫ్ షేక్ క్యాష్ విధులు నిర్వహిస్తున్నాడు. అయితే చోరీ సమయంలో టీ తాగడానికి బయటకు వెళ్లిన అల్తాఫ్ షేక్ ఇంకా రాలేదని పోలీసుల చెబుతున్నారు. అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు.