ఘట్ కేసర్, వెలుగు: ఇంటికి లాక్ వేయడం మరిచిపోయి పడుకోగా.. రెండిళ్లలో దొంగలు పడి బంగారు, వెండి ఆభరణాలను చోరీ చేశారు. పోచారం ఐటీ కారిడార్ ఇన్ స్పెక్టర్ రాజు వర్మ తెలిపిన ప్రకారం.. ఇస్మాయిల్ ఖాన్ గూడ పరిధి నవదుర్గ నగర్ కాలనీ ఫేస్–-2లో ఉండే ఐటీ ఎంప్లాయ్ మేర్లు రంజిత్(31) ఈనెల20న రాత్రి ఇంటి పెంట్ హౌస్ డోర్ కు తాళం వేయకుండా నిద్రపోయారు. ఉదయం చూసేసరికి మరో బెడ్ రూమ్ లోని బీరువా తెరిచి ఉంది.
అందులోని 4.5 తులాల బంగారు నగలు కనిపించలేదు. దొంగలు పెంట్ హౌస్ తలుపులు తొలగించి ఇంట్లోకి చొరబడి ఎత్తుకెళ్లినట్టు రంజిత్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి ఇంటి పక్కనే ఉండే విశ్వనాథ్ ఇంట్లోనూ దొంగలు పడి బీరువాలోని10 తులాలు వెండి వస్తువులు ఎత్తుకెళ్లారు. రంజిత్ ఇంటి పై నుంచి తమ ఇంట్లోకి వచ్చారని బాధితుడు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.