టిక్ టాక్, హలో యాప్ లకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఈ యాప్ లు జాతి వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రంగా మారాయని వచ్చిన ఆరోపణలపై ఆ సంస్థలకు 21 ప్రశ్నలతో కూడిన నోటీసులను జారీ చేసింది. సరైన వివరణ రాకపోతే ఆ రెండు యాప్ లను దేశంలో నిషేధిస్తామని హెచ్చరిస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ గురువారం ఈ నోటీసులు జారీ చేసింది. ఈ రెండు యాప్ లపై వచ్చిన ఆరోపణలపై ఐటీ శాఖ ఆయా సంస్థల నుంచి వివరణ కోరింది. వీటిలో వినియోగదారులకు సంబంధించిన సమాచారం ప్రస్తుతం గానీ, భవిష్యత్తులో గానీ ఇతర దేశాల వ్యక్తులకు, ప్రైవేటు వ్యక్తులకు బదిలీ చేయమని హామీ ఇవ్వాలని ఆదేశించింది.
అదేవిధంగా ఇతర సోషల్ మీడియాల్లో మార్ఫింగ్ చేసిన రాజకీయ ప్రకటనల కోసం ఈ సంస్థలు డబ్బులు ఖర్చు పెట్టాయని వచ్చిన ఆరోపణలపై కూడా వివరణ ఇవ్వాలని తెలిపింది. భారత నిబంధనల ప్రకారం 18 ఏళ్లలోపు వారంతా చిన్నపిల్లలే కాబట్టి ఆ లోపు పిల్లలందరినీ దీని నుంచి నిషేధించాలని ఆదేశించింది.