- తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఆర్సీఏ
- రేపు న్యూజిలాండ్తో ఫస్ట్ టీ20
జైపూర్: టీ20 వరల్డ్కప్లో మంచుతో ఇబ్బందులు ఎదుర్కొన్న టీమిండియాకు.. మళ్లీ అదే ప్రమాదం పొంచి ఉంది. బుధవారం నుంచి న్యూజిలాండ్తో జరిగే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లోనూ మంచు కీలకంగా మారబోతున్నది. తొలి మ్యాచ్కు వేదికైన పింక్ సిటీ జైపూర్లో ఇప్పటికే రాత్రి వేళలో భారీ స్థాయిలో మంచు కురుస్తున్నది. దీంతో ఈ సిరీస్లోనూ టాస్ అతిపెద్ద పాత్ర పోషించే చాన్స్ కనిపిస్తోంది. ఎనిమిదేళ్ల తర్వాత సవాయ్ మాన్సింగ్ స్టేడియం ఫస్ట్ మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తుండటంతో.. రాజస్తాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్సీఏ) కూడా టీమిండియా విజయం కోసం చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా మ్యాచ్ టైమ్లో మంచు ప్రభావం తగ్గించేందుకు కెమికల్స్ను స్ప్రే చేయాలని డిసైడ్ అయ్యింది. ‘గత రెండు రోజుల నుంచి రాత్రి 7 గంటలకే మంచు కురవడం మొదలైంది. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్కు కూడా దీని ప్రభావం ఉంటుంది. మ్యాచ్ రోజు యాంటీ డ్యూ స్ప్రేను ఉపయోగించినా దాని ప్రభావం పరిమితంగానే ఉండనుంది. ఇక్కడ ఫస్ట్ టీ20 మ్యాచ్ కావడంతో ఈ పిచ్పై భారీ స్కోర్లు వచ్చే అవకాశాలున్నాయి’ అని ఆర్సీఏ అఫీషియల్స్ పేర్కొన్నారు.
పొల్యూషన్ ముప్పు!
ఈ మ్యాచ్కు మంచుతో పాటు ఎయిర్ పొల్యూషన్ ముప్పు కూడా కనిపిస్తోంది. ఢిల్లీ మాదిరిగా జైపూర్లో కూడా ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ పెరిగాయి. సిటీలో ఆదివారం ఉదయం విపరీతమైన పొగ కమ్ముకుంది. గత వారం రోజులుగా పింక్ సిటీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 337 పాయింట్లుగా నమోదవుతున్నది. దీంతో మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. అయితే, తామున్నది క్రికెట్ ఆడటానికే అని ఇండియా వైస్ కెప్టెన్ లోకేశ్ రాహుల్ అంటున్నాడు. పొల్యూషన్ అంత తీవ్రంగా ఏమీ లేకపోవచ్చని అభిప్రాయపడ్డాడు.
25 వేల మంది ఫ్యాన్స్
ప్రస్తుతం జైపూర్లో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకపోవడంతో ఈ మ్యాచ్కు ప్రేక్షకుల సంఖ్య భారీగానే ఉండనుంది. దాదాపు 25 వేల మంది హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టికెట్ల సేల్ మొదలైన మూడు గంటల్లోనే 8 వేలు అమ్ముడుపోయాయని ఆర్సీఏ సెక్రటరీ మహేంద్ర వర్మ వెల్లడించాడు.. మరోవైపు కొవిడ్ కారణంగా మే నెలలో ఐపీఎల్ను అర్ధాంతరంగా ముగించి యూఏఈ తీసుకెళ్లిన బీసీసీఐ.. ఈ సిరీస్ను సక్సెస్ఫుల్గా నిర్వహించాలని భావిస్తోంది. వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం ఇప్పట్నించే ప్లాన్స్ వేస్తోంది.
ఇండియా ప్రాక్టీస్ షురూ.. కివీస్ ప్లేయర్ల ఎంట్రీ
ఈ సిరీస్ కోసం ఇప్పటికే జైపూర్ చేరుకొని మూడు రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న టీమిండియా ప్రాక్టీస్ షురూ చేసింది. కొత్త హెడ్ కోచ్ ద్రవిడ్ పర్యవేక్షణలో సోమవారం తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. టీ20 నయా కెప్టెన్ రోహిత్ శర్మ నెట్స్లో భారీ షాట్లు కొడుతూ కనిపించాడు. మిగతా ప్లేయర్లు కూడా వామప్స్తో పాటు ఫీల్డింగ్ డ్రిల్స్ చేశారు. నెట్ సెషన్లో చెమటోడ్చారు. మరోవైపు ఆదివారం రాత్రి టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిన న్యూజిలాండ్ టీమ్ దుబాయ్ నుంచి చార్టర్ ఫ్లైట్లో సోమవారం సాయంత్రం జైపూర్లో ల్యాండ్ అయింది. వరల్డ్ కప్ బబుల్ నుంచి నేరుగా వచ్చిన నేపథ్యంలో తొలి మ్యాచ్కు ముందు కివీస్ ప్లేయర్లకు ఎలాంటి క్వారంటైన్ అవసరం లేదు. కివీస్ మంగళవారం ప్రాక్టీస్ స్టార్ట్ చేయనుంది.
ద్రవిడ్తో చాన్నాళ్ల పరిచయం నా అదృష్టం: రాహుల్
కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి పనిచేసేందుకు ఆత్రుతగా ఉన్నానని ఇండియా టీ20 వైస్ కెప్టెన్ లోకేశ్ రాహుల్ అన్నాడు. షార్ట్ ఫార్మాట్లో కెప్టెన్సీ అందుకున్న రోహిత్.. డ్రెస్సింగ్ రూమ్కు మరింత ప్రశాంతతను తీసుకొస్తాడని అభిప్రాయపడ్డాడు. కివీస్తో ఫస్ట్ టీ20కి ముందు లోకేశ్ సోమవారం మీడియాతో మాట్లాడాడు. ‘రోహిత్ కెప్టెన్సీ సత్తా ఏంటో ఐపీఎల్లో అందరూ చూశారు. ఆటపై తనకు సంపూర్ణ అవగాహన ఉంది. వ్యూహాత్మకంగానూ చాలా ముందున్నాడు. అందుకే లీడర్గా ఎదిగాడు. డ్రెస్సింగ్లోకి తను చాలా ప్రశాంతతను తీసుకొస్తాడు’ అని రాహుల్ చెప్పుకొచ్చాడు. ఇక, చాన్నాళ్లుగా రాహుల్ ద్రవిడ్తో పరిచయం ఉండటం తన అదృష్టమని అన్నాడు. తనెప్పుడూ టీమ్ కల్చర్ను డెవలప్ చేయడంతో పాటు ప్లేయర్ల మధ్య మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తాడని చెప్పాడు. కాగా, ద్రవిడ్ నేతృత్వంలోని కొత్త కోచింగ్ స్టాఫ్, టీ20 కెప్టెన్గా రోహిత్, వైస్ కెప్టెన్గా లోకేశ్ ఈ సిరీస్తోనే బాధ్యతలు అందుకుంటున్నారు. దాంతో, ఇండియా టీమ్లో కొత్త అధ్యాయం మొదలవుతోంది.