
టోల్ గేట్ ఫీజులు పెరిగాయి. పెరిగిన ధరలు మార్చి 31 అర్ధరాత్రి నుంచే అమల్లోకి రానున్నాయి. టోల్ ఫీజును రహదారి విస్తరణ కాంట్రాక్టు సంస్థ జీఎంఆర్ యాజమాన్యం పెంచింది. ఒక్కో వాహనానికి ఒక వైపు ఇరు వైపులా కలిపి రూ. 5 నుంచి రూ. 40 వరకు, స్థాని కుల నెలవారీ పాస్ను రూ.330 నుంచి రూ.340 కి పెంచింది. ఏడాది కాలం పాటు ఇవే ధరలు అమల్లో ఉంటాయి.
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండల ఆంథోల్ మైసమ్మ దేవాలయం నుంచి ఏపీలోని కృష్ణా జిల్లా చిల్లకల్లు వరకు గల 181.5 కి.మీ మేర రెండులేన్లుగా ఉన్న రహదారిని దాదాపు రూ.2000 కోట్ల వ్యయంతో 2012లో బీవోటీ పద్ధతిన జీఎంఆర్ నాలుగు లేన్లుగా విస్తరించింది. చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలోని కృష్ణా జిల్లా చిల్లకల్లు వద్ద ఒకొక్కటి చొప్పున మూడు టోల్ప్లాజాలను జీఎంఆర్ సంస్థ ఏర్పాటు చేసింది. వీటి ద్వారా 2012 నుంచి టోల్ఫీజు వసూళ్లను కాంట్రాక్టు సంస్థ ప్రారంభించింది.