ఏప్రిల్ 26న ఐటీ కారిడార్​లో ట్రాఫిక్ ఆంక్షలు

ఏప్రిల్ 26న ఐటీ కారిడార్​లో ట్రాఫిక్ ఆంక్షలు

 గచ్చిబౌలి, వెలుగు : ఈ నెల 26న హైటెక్స్​లో జరిగే ఓ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో 26న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఐటీ కారిడార్​లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. జూబ్లీహిల్స్​రోడ్​ నంబర్ 45 నుంచి కేబుల్ బ్రిడ్జి, బయోడైవర్సిటీ జంక్షన్ మీదుగా గచ్చిబౌలి వైపు వెళ్లే వెహికల్స్​మాదాపూర్ పోలీస్ స్టేషన్, సీఓడీ జంక్షన్, దుర్గం చెరువు, ఐలాబ్, ఐటీసీ కోహినూర్, నాలెడ్జ్ సిటీ మీదుగా బయోడైవర్సిటీకి చేరుకోవాల్సి ఉంటుందన్నారు.

 మియాపూర్, కొత్తగూడ, హఫీజ్ పేట నుంచి హైటెక్ సిటీ, సైబర్ టవర్స్, జూబ్లీహిల్స్, ఖానమేట్, కొత్తగూడ వైపు వచ్చే వాహనాలు రోలింగ్ హిల్స్, ఏఐజీ హాస్పిటల్, ఐకీయా, దుర్గం చెరువు మీదుగా హైటెక్స్, సైబర్ టవర్స్ వైపు వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఈ ఏరియాల్లోకి భారీ వాహనాలను అనుమతించడం లేదని పోలీసులు స్పష్టం చేశారు.