అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడులు చేసింది. తమ మిలిటరీ కమాండర్ ఖాసిం సులేమానీ హత్యకు ప్రతీకారంగా ఇరాక్లోని రెండు అమెరికా మిలిటరీ బేస్లపై మిస్సైళ్లతో ఎటాక్ చేసింది. ఈ దాడుల్లో 80 మంది అమెరికా సోల్జర్లు చనిపోయారని ఇరాన్ బుధవారం ప్రకటించింది. అయితే ఇరాన్ చేసిన దాడుల్లో అమెరికా సైనికులెవరూ గాయపడలేదని ఆ దేశ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్తో ముందే సైనికులందరినీ తరలించామని చెప్పారు. తాను ప్రెసిడెంట్గా ఉన్నంత కాలం ఇరాన్ను న్యూక్లియర్ బాంబు తయారు చేయనివ్వబోనని ప్రకటించారు. మిడిల్ఈస్ట్లో టెన్షన్ల నేపథ్యంలో ఇరాక్కు వెళ్లొద్దని కేంద్ర ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది.
వాషింగ్టన్: ఇరాన్ మిలటరీ కమాండర్ ఖాసిం సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటానని ముందుగా ప్రకటించినట్టుగానే ఇరాక్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ మిస్సైళ్లతో దాడి చేసింది. ఈ దాడుల్లో 80 మంది అమెరికన్ సోల్జర్లు చనిపోయారని ఇరానియన్ స్టేట్ మీడియా బుధవారం ప్రకటించింది. ఇరాక్లోని అల్ అసద్, ఇర్బిల్ ఎయిర్బేస్లపై 22 మిస్సైళ్లతో ఎటాక్ చేసినట్టు తెలిపింది. ఈ ఎటాక్స్లో హెలికాప్టర్లు, ఇతర మిలటరీ పరికరాలు దెబ్బతిన్నట్టు పేర్కొంది. ప్రతీకార చర్యలకు దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఈ ప్రాంతంలో అమెరికా, దాని సంకీర్ణ దళాలకు చెందిన 140 టార్గెట్లను గుర్తించామని, అమెరికా మరోసారి తప్పుచేస్తే వీటిపై ఎటాక్ చేస్తామని రివల్యూషనరీ గార్డ్స్ వర్గాలు తెలిపాయి. ఇరాక్లోని అల్ అసద్ బేస్ పై 15 మిసైళ్లతో దాడులు చేసినా… అమెరికన్ ఆర్మీ మాత్రం తమ రాడార్లతో వాటిని గుర్తించలేకపోయిందని చెప్పాయి. మిసైళ్ల దాడి అమెరికాకు ‘‘ చెంప దెబ్బ” అని టెహ్రాన్ తెలిపింది.
మాకు నష్టం జరగలే: ఇరాక్
మంగళవారం రాత్రంతా జరిగిన ఇరాన్ మిస్సైళ్ల దాడుల్లో తమ సైన్యానికి మాత్రం ఎలాంటి నష్టం జరగలేదని ఇరాక్ ఆర్మీ వర్గాలు చెప్పాయి. మంగళవారం రాత్రి 1: 45 నుంచి 2: 15 వరకు 22 మిసైళ్ల దాడులు జరిగాయని తెలిపాయి. తమ దేశంలో ఉన్న యూఎస్ సైనిక స్థావరాలపై మిసైళ్ల దాడి చేసి తీరుతామని ఇరాన్ తమకు ముందుగానే చెప్పిందని ఇరాక్ ప్రకటించింది. ఖాసిం సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ తమకు మెసేజ్ ఇచ్చిందని ఇరాక్ ప్రధాని ఆఫీస్ తెలిపింది. అయితే లోకేషన్ల వివరాలు మాత్రం వెల్లడించలేదని పేర్కొంది.
నష్టాన్ని అంచనా వేస్తున్నాం: అమెరికా
మిసైళ్ల ఎటాక్లో 80 మంది సోల్జర్లు చనిపోయిన వార్తను ఖండించకపోయినా…యుద్ధంలో జరిగిన నష్టాన్ని అంచనావేసే పనిలో ఉన్నామని అమెరికా డిఫెన్స్ వర్గాలు తెలిపాయి. ఐఎస్ టెర్రర్ గ్రూప్కు వ్యతిరేకంగా ‘ ఇంటర్నేషనల్ కూటమి’ లో భాగంగా ఇరాక్లో 5 వేలమంది అమెరికన్ సైనికులు ఉన్నారు.
అమెరికాకు చెంపదెబ్బ: ఖమైనీ
మిస్సైళ్ల దాడిపై ఇరాన్ సీనియర్ నేత అలీ ఖమైనీ రియాక్ట్ అయ్యారు. లైవ్ టెలికాస్ట్లో లో ఖమైనీ మాట్లాడారు. ‘‘మంగళవారం చెంప దెబ్బ మాత్రమే కొట్టాం. సులేమానీ హత్య తర్వాత మన డ్యూటీ ఇప్పుడు ఏంటి అన్నదే ఇంపార్టెంట్ ఇష్యూ. ఇలాంటి మిలటరీ యాక్షన్ సరిపోదు”అని ఖమైనీ చెప్పారు.
ఫారెన్ మినిస్ట్రీ ట్రావెల్ అడ్వైజరీ
ఇరాన్ మిసైళ్ల ఎటాక్ నేపథ్యంలో ఇరాక్లో నెలకొన్న టెన్షన్ పరిస్థితులపై మనదేశం రియాక్ట్ అయింది. ట్రావెల్ అడ్వైజరీని మన ఫారెన్ మినిస్ట్రీ జారీచేసింది. ఇరాక్లో టెన్షన్ ఉన్నందున మనవాళ్లు ఆదేశానికి వెళ్లకుండా ఉంటే మంచిదని తెలిపింది. తర్వాతి నోటిఫికేషన్ వచ్చేవరకు ఇరాక్కు ప్రయాణాలు మానుకోవాలని సలహా ఇచ్చింది. ఇరాక్లోని మనవాళ్లు ఎలర్ట్గా ఉండాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప బయట తిరగొద్దని తెలిపింది. బాగ్దాద్లోని ఎంబసీ అక్కడున్న మనవాళ్లకు అండగా ఉంటుందని పేర్కొంది. మిడిల్ఈస్ట్లో నెలకొన్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని పలు ఎయిర్లైన్స్ సంస్థలకు కూడా కేంద్రం హెచ్చరికలు జారీచేసినట్టు తెలిసింది. ఇరాన్, ఇరాక్, గల్ఫ్ ఎయిర్స్పేస్లోకి విమానాలను పోనీయొద్దని కేంద్రం ఆదేశించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇలాంటి చర్యలొద్దు: బ్రిటన్, ఇజ్రాయిల్
అమెరికాపై ఇరాన్ దాడుల్ని బ్రిటన్ ఖండించింది. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడ వద్దని బ్రిటన్ ఫారెన్ మినిస్టర్ డొమనిక్ రాబ్ ఇరాన్కు వార్నింగ్ ఇచ్చారు. యుద్ధం వస్తే ఐసిస్, ఇతర టెర్రర్ గ్రూపులకు మాత్రమే ఉపయోగముంటుందని ఆయన చెప్పారు. ఇజ్రాయిల్ కూడా ఈ చర్యను తప్పుపట్టింది.