అక్కను చంపబోతే..చెల్లెలి హత్య బయటపడింది

అక్కను చంపబోతే..చెల్లెలి హత్య బయటపడింది
  • 16 రోజుల తర్వాత వీడిన మిస్టరీ

రాయికల్/ఇబ్రహీంపట్నం, వెలుగు: చెల్లెలను హత్య చేయడమే కాకుండా అక్కను సైతం చంపబోయాడు. తప్పించుకున్న అక్క పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడే 16 రోజుల క్రితం చెల్లెలిని హత్య చేసిన విషయం బయటపడింది. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల విలేజ్ కు చెందిన రాజారామ్, అదే గ్రామానికి చెందిన పాలెపు నర్సు(49) మధ్య పరిచయం ఉంది. పాలెపు నర్సును  గత నెల 26న వేములవాడ జాతరకంటూ రాజారామ్ తీసుకువెళ్లాడు. ఆ రోజు నుంచి ఆమె  కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. పాలెపు నర్సు అక్క శంకరమ్మ దగ్గర రాజారామ్ డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు ఇవ్వమని శంకరమ్మ ఒత్తిడి తెస్తుండడంతో ఆమెను ఈ నెల 2న ల్యాండ్ విషయం మాట్లాడాల్సి ఉందంటూ మేడిపల్లి మండలం తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నించగా తప్పించుకుంది. రాయికల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రాజారామ్పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్ కు  తరలించారు. తన చెల్లెలను రాజారామ్హత్య చేసి ఉండొచ్చని శంకరమ్మకు అనుమానం వచ్చింది. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో జిల్లా ఎస్పీ సింధు శర్మకు ఫిర్యాదు చేశారు. దాంతో రాయికల్ పోలీసులు కస్టడీ పిటిషన్ వేసి రాజారామ్ను ఎంక్వైరీ చేశారు. విచారణలో నర్సును ఇబ్రహీపట్నం మండలం సత్తక్కపల్లె విలేజ్ శివారులో హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఆ ప్రదేశంలో ఆమె డెడ్ బాడీని చూపించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.