తెలంగాణ ఎంసెట్ ద‌ర‌ఖాస్తు గడువు పెంపు

తెలంగాణ ఎంసెట్ ద‌ర‌ఖాస్తు గడువు పెంపు

TS EAMCET 2020 ఎగ్జామ్‌కు అప్లై చేయలేని విద్యార్థులకు శుభవార్త. రాష్ట్రంలో ఎంసెట్‌కు అప్లై చేయడానికి మరో అవకాశం కల్పించింది తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్-TSCHE. తెలంగాణ ఎంసెట్ 2020 దరఖాస్తు గడువు ఇప్పటికే ముగిసిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ సంక్షోభం కారణంగా విద్యార్థులు ఎవరైనా ఇప్పటివరకు ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు చేయలేకపోతే వారికి మరో అవకాశం క‌ల్పించిన‌ట్లు ప్ర‌క‌టించింది. రూ.10,000 లేట్ ఫీజు తో ఆగస్ట్ 31 వరకు https://eamcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది.

జూలైలోనే ఎంసెట్ పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రాష్ట్రంలో ప్ర‌వేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. దీంతో టీఎస్ ఎంసెట్ ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. గత వారం విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి… ఎంసెట్‌తో పాటు ఇతర పరీక్షలపై సమీక్షించారు. తెలంగాణ ఎంసెట్‌ను సెప్టెంబర్ 9 నుంచి నిర్వహించాలని భావిస్తున్నామని తెలిపారు. తుది షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది.