తక్షణ సాయం ఉత్తమాటే!:ఇండ్లు మునిగినయ్... ప్రాణాలు పోయినయ్

తక్షణ సాయం ఉత్తమాటే!:ఇండ్లు మునిగినయ్... ప్రాణాలు పోయినయ్
  • ఇండ్లు మునిగినా... ప్రాణాలు పోయినా తక్షణ సాయం ఉత్తమాటే!
  • ఇటీవలి వర్షాలతో నిత్యావసర సరుకులు, సామాన్లు నీటిపాలు

మంచిర్యాల, వెలుగు: రాష్ర్టంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో పలు టౌన్లు, ఊళ్లలో ఇండ్లు నీట మునిగాయి. సామాన్లు కొట్టుకుపోవడంతో పాటు ఇండ్లు కూలిపోయాయి. నిత్యావసర సరుకులు, బట్టలు, ఫర్నిచర్, ఎలక్ర్టానిక్​ వస్తువులు నీళ్లపాలయ్యాయి. కార్లు, బైక్​లు పాడయ్యాయి. ఒక్కో ఇంట్లో వేలు, లక్షల్లో నష్టం జరిగింది. ఇటువంటి విపత్తులు సంభవించినప్పుడు నిరాశ్రయులైన వారికి షెల్టర్​ ఏర్పాటు చేయడంతో పాటు తక్షణ సహాయంగా బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ, తీవ్రతను బట్టి రూ.10వేల వరకు ఆర్థిక సహాయం అందించడం గతంలో ఆనవాయితీగా ఉండేది. కానీ టీఆర్ఎస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరద బాధితులను గాలికి వదిలేసింది. కంటితుడుపుగా టెంపరరీ షెల్టర్, భోజనం ఏర్పాట్లు చేయడం తప్పితే తక్షణ సహాయం గానీ, నష్టపరిహారం గానీ అందించడం లేదు. ప్రాణ నష్టం జరిగినా పట్టించుకోవట్లేదు. ఇంతకుముందు పరిస్థితిని బట్టి కలెక్టర్లు వెంటనే నిర్ణయాలు తీసుకొని కాంటిజెన్సీ ​ఫండ్​ ద్వారా బాధితులకు తక్షణ సహాయం చేసేవారు. ప్రస్తుతం గవర్నమెంట్​ నుంచి ఆర్డర్స్​వస్తే తప్ప కలెక్టర్లు సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకపోవడంతో చేతులు కట్టేసుకుంటున్నారు. 
తక్షణ సాయం అందక తిప్పలు
ఇండ్లు మునిగినా, ప్రాణాలు పోయినా ప్రభుత్వం నుంచి తక్షణ సహాయం అందకపోవడంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నెల 23న మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎల్ఐసీ కాలనీ, రాంనగర్, ఎన్టీఆర్​ నగర్​కాలనీలను రాళ్లవాగు వరదలు ముంచెత్తాయి. తిండి సామాన్లు, కట్టుబట్టలతో పాటు టీవీలు, కూలర్లు, ఫ్రిజ్​లు, వాషింగ్​ మిషన్లు, బెడ్స్, పరుపులు, ఫర్నిచర్​ తడిసిపోయాయి. ఎన్టీఆర్​ నగర్​లోని సుమారు ఇరవై ఇండ్లలోని సామాన్లన్నీ నీళ్లపాలయ్యాయి. బాధితులకు ఒకరోజు షెల్టర్, భోజనాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకొన్నారు. వరద తగ్గగానే ఇండ్లకు పోయినవారు నాలుగైదు రోజులుగా బియ్యం, ఉప్పు పప్పులు కూడా లేక తిండికి తిప్పలు పడ్డారు. కరెంట్, గ్యాస్, సరుకులు, మంచినీళ్లు కూడా లేక పిల్లాపాపలతో అల్లాడిపోయారు. ఇండ్లలో నిండిన బురదను క్లీన్​ చేసుకుంటూ హోటళ్లలో తిన్నారు. ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావు, ఆఫీసర్లు వచ్చిపోవుడు తప్ప తక్షణ సహాయం అందించలేదని వాపోయారు. రాష్ర్టంలోని మిగతా ప్రాంతాల్లోనూ వరద బాధితులది ఇదే పరిస్థితి. 
కొరగాని విపత్తు సాయం
వరదలు వంటి విపత్తులు వచ్చినప్పుడు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు స్టేట్​డిజాస్టర్ రెస్పాన్స్​ ఫండ్ (ఎస్ డీఆర్ఎఫ్), నేషనల్ ​డిజాస్టర్​ రెస్పాన్స్​ ఫండ్(ఎన్​డీఆర్ఎఫ్) కింద బాధితులకు అందిస్తున్న ఆర్థికసాయం వారికి జరిగిన నష్టంతో లెక్కిస్తే ఎందుకూ కొరగావడం లేదు. 2015 ఏప్రిల్​1 నుంచి అమల్లోకి వచ్చిన జీవో ప్రకారం వరదలతో ఇండ్లు వాష్​అవుట్​అయితే... బట్టలకు రూ.1,800, పాత్రలు, ఇంటి సామాన్లకు రూ.2 వేలు మాత్రమే చెల్లిస్తుండడం గమనార్హం. వరదలతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల ఆర్థికసాయం, ఇక అవయవాలను కోల్పోయి 40:-60 పర్సెంట్​ వైకల్యం కలిగితే రూ.59,100, డిజేబులిటీ 60 శాతం కంటే ఎక్కువ ఉంటే రూ.2 లక్షలు అందిస్తున్నారు. తీవ్రగాయాలతో వారం కన్నా ఎక్కువ రోజులు హాస్పిటల్​పాలైతే రూ.12,700, వారం రోజుల లోపు హాస్పిటల్​లో ఉంటే రూ.4,300 సాయం చేస్తున్నారు. కానీ ప్రాణ నష్టం జరిగినవారికి కూడా తక్షణ సాయం అందించకపోవడంతో పేదలు అంత్యక్రియలకూ దిక్కులు చూడాల్సి వస్తోంది. 
ఎలక్షన్లు ఉన్నచోటే ఆర్థికసాయం
రాష్ర్ట ప్రభుత్వం విపత్తు నష్టాన్ని సైతం ఎలక్షన్ల కోణంలోనే చూస్తోందన్న విమర్శలున్నాయి. నిరుడు హైదరాబాద్​లో వరదలు వచ్చి లక్షలాది ఇండ్లు నీట మునిగాయి. కొద్దిరోజుల్లో జీహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉండడంతో ప్రభుత్వం ఇంటికి రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం ప్రకటించింది. అది ఎన్ని కుటుంబాలకు అందింది, అందులో చేతివాటం వేరే సంగతి. తర్వాత వరంగల్​ నగరాన్ని వరదలు ముంచెత్తితే సర్కారు పైసా సాయం చేయలేదు. తాజాగా మంచిర్యాల, నిర్మల్​తో పాటు పలుచోట్ల వరదలు అతలాకుతలం చేశాయి. కానీ ఇప్పుడు ఎలక్షన్లు లేకపోవడంతో ప్రభుత్వం తమను గాలికొదిలేసిందని వరద బాధితులు మండిపడుతున్నారు. 
హామీ ఇచ్చిన్రు.. సాయం అందలే
వనపర్తి జిల్లా రేపల్లి మండలం బండరావిపాకుల గ్రామంలో గత నెల ఇల్లు కూలి గ్రామ సర్పంచ్ అయిన మా అమ్మ, ఆమెతో పాటు నిద్రిస్తున్న నా కొడుకు యోగేష్ చనిపోయిన్రు. ఐదు లక్షలు ఇప్పిస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​రెడ్డి హామీ ఇచ్చిన్రు. కానీ ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సాయం అందలేదు.
                                                                                                                                                                                                                                                      - సలేశ్వరం, వనపర్తి
బియ్యం ఉప్పు పప్పులు కూడా ఇయ్యలే 
రాళ్లవాగు వరదలో మా ఇల్లు పూర్తిగా మునిగింది. ఇంట్లోని సామాన్లన్నీ కొట్టుకు పోయినయ్​. నేను ఇంట్లనే చిన్నగ బట్టల బిజినెస్​ చేస్త. అమ్మకానికి తెచ్చి పెట్టుకున్న రూ.50 వేల చీరలు, డ్రెస్​లు పోయినయ్​. బీరువాలో పెట్టిన రూ.20 వేల డబ్బులు, రెండు తులాల బంగారం పోయింది. ఎలక్ర్టానిక్​ వస్తువులన్నీ పాడైనయ్​. మొత్తం రూ.3లక్షల నష్టం జరిగింది. ఇల్లు క్లీనింగ్​కే నాలుగు రోజులు పట్టింది. తిండి సామాన్లు కూడా హోటళ్ల తెచ్చుకున్నం. ఎమ్మెల్యే వచ్చి చూసిండు.. ఆఫీసర్లు రాసుకపోయిన్రు కానీ ఇంతవరకు పైసా సాయం చేయలే. కనీసం బియ్యం ఉప్పు పప్పులు కూడా ఇయ్యలే. 
                                                                                                                                                                                                                                        - నూర్జహాన్, ఎన్టీఆర్​నగర్, మంచిర్యాల

ఇంటికి పదివేలు ఇయ్యాలె
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాళ్లవాగుకు వరదలొచ్చి మూడు కాలనీలు నీటమునిగాయి. లక్షల్లో నష్టం జరిగింది. నిత్యావసర సరుకులు కొట్టుకపోయి పేదలు తిండికి తిప్పలు పడ్డరు. ప్రభుత్వం నుంచి తక్షణ సాయం చేయలే. బీజేపీ తరపున వంద కుటుంబాలకు సరుకులు పంపిణీ చేసినం. ప్రభుత్వం వెంటనే ప్రతి కుటుంబానికి పదివేల చొప్పున ఆర్థిక సహాయం అందించి పేదలను ఆదుకోవాలె. 
                                                                                                                                                                                                      - వెరబెల్లి రఘునాథ్​రావు, బీజేపీ డిస్ట్రిక్ట్​ ప్రెసిడెంట్, మంచిర్యాల