రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రతినెల మొదటి తేదీనే వేతనాలు చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టిఎస్ యుటిఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి డిమాండ్ చేశారు. గత జనవరి నుండి ఒక్కో డిడిఓ పరిధిలోని ఉద్యోగులకు ఒక్కో తేదీన 1 నుండి 10వ తేదీ వరకు వేతనాలు అకౌంట్లలో జమ అవుతున్నాయని కమిటీ తెలిపింది. తొలుత సాంకేతిక ఇబ్బందులు అనుకున్నామని, కానీ ప్రతినెలా ఇదొక ఆనవాయితీగా ఆర్థిక శాఖ పాటిస్తున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. పనిచేసిన కాలానికి ఇచ్చే వేతనం నెల మొదటి తేదీనే ఇవ్వాలని కూడా రాష్ట్రంలో డిమాండ్ చేయాల్సిరావటం నిజంగా విచారకరమన్నారు. ఈ నెల ఏడవ తేదీ నాటికి ఇంకా ఆదిలాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూలు, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్ తదితర జిల్లాలల్లో ఉపాధ్యాయుల సెప్టెంబర్ నెల వేతనాలు జమకాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంకా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ కుటుంబ అవసరాల కోసం తాము దాచుకున్న జిపిఎఫ్ సొమ్ము నుండి మంజూరు చేయించుకున్న జిపిఎఫ్ రుణాలు, పాక్షిక ఉపసంహరణ, రిటైరైన, మరణించిన ఉద్యోగుల తుది చెల్లింపులు పొందటానికి కూడా నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తున్నదని కమిటీ సభ్యులు ఆరోపించారు. మెడికల్ రీయింబర్స్మెంట్, సరెండర్ లీవ్, రిటైరైన ఉద్యోగుల సెలవు జీతాల సొమ్ము విడుదల చేయడంలో కూడా విపరీతమైన జాప్యం జరుగుతోందని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆరోపించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరికీ సెప్టెంబర్ నెల వేతనాలు తక్షణమే జమచేయాలని, ప్రతినెలా ఒకటో తేదీనే జమ చేయాలని టిఎస్ యుటిఎఫ్ డిమాండ్ చేస్తున్నదని తెలిపారు.