న్యూఢిల్లీ: టీమిండియా పేస్ అటాక్లో ఉమేశ్ యాదవ్ ఇప్పుడు కీలక బౌలర్. పదేళ్లుగా నేషనల్ టీమ్లో మెంబర్గా ఉన్న ఉమేశ్.. జట్టుపై ఇప్పటికే తనదైన ముద్ర వేశాడు. అద్భుత బౌలింగ్తో చాలా మ్యాచ్ల్లో ఒంటి చేత్తో ఇండియాను గెలిపించాడు. కొన్ని సార్లు మెరుపు బ్యాటింగ్తో అలరించాడు. ఓ చిన్న టౌన్ నుంచి వచ్చి ఇండియా స్టార్ పేసర్గా ఎదిగే క్రమంలో ఉమేశ్ ఎన్నో కష్టాలకు ఎదురొడ్డాడు. కనీసం క్రికెట్ కిట్ కూడా కొనుక్కోలేని స్థాయి నుంచి ఆటనే నమ్ముకొని పైకొచ్చాడు. నడి వేసవిలో రోజుకు మూడే సి మ్యాచ్లు ఆడి, వచ్చిన డబ్బుతో షూస్, బ్యాట్, ప్యాడ్స్ సమకూర్చుకున్నానని ఉమేశ్ తన చిన్ననాటి సంగతులు గుర్తు చేసుకున్నాడు. ‘మాది పేద కుటుంబం కావడంతో చిన్నప్పుడు నాకు ఇంటి నుంచి డబ్బు అందేది కాదు. కానీ, క్రికెట్ ఆడాలంటే స్పైక్స్, బ్యాట్, ప్యాడ్స్ ఇతరత్రా కొనుక్కోవాల్సి వచ్చేది. అందుకు డబ్బు కావాలిగా. దాంతో, నడి వేసవిలో నేను రోజుకు మూడు మ్యాచ్లు ఆడేవాడిని. ఆ టైమ్లో నాగ్పూర్లో ఎంత ఎండ ఉన్నా సరే నేను మ్యాచ్లు ఆడాల్సిన పరిస్థితి. చాలా కష్టంగా అనిపించేది’ అని ఓ ఇంటర్వ్యూలో ఉమేశ్ చెప్పాడు.
షూ లేదని కోచ్ వెక్కిరించాడు
తనకు షూ లేదని ఓ కోచ్ అందరి ముందు అవమానించడంతో క్రికెట్ను వదిలేద్దామని అనుకున్నానని ఉమేశ్ గుర్తు చేసుకున్నాడు. ఏదో ఒకటి సాధించగలనన్న నమ్మకమే తనను ముందుకు తీసుకెళ్లిందన్నాడు. ఓ మ్యాచ్లో తన ఫాస్ట్ యార్కర్లను చూసిన ఓ వ్యక్తి అవకాశం ఇవ్వడంతో తన సత్తా నిరూపించుకునే అవకాశం దొరికిందని తెలిపాడు. ‘చిన్నప్పుడు నేను లెథర్ బాల్ను ముట్టుకునేందుకే చాలా సమయం పట్టింది. ఆ బాల్ను నేను టీవీల్లోనే ఎక్కువ చూశా. ఓసారి దానితో ఆడే అవకాశం వచ్చింది. అప్పుడు టీవీలో చూసిన బాల్.. ఈ బాల్ ఒకేలా ఉంది అనుకున్నా. గ్రౌండ్లో నేను బౌలింగ్ చేస్తున్నప్పుడు.. నా ఫాస్ట్ యార్కర్లను ఎవరో నోటీస్ చేశారు. దాంతో, నాగ్పూర్ డిస్ట్రిక్ట్ టీమ్కు ఆడాలని ఆ జిల్లా సెక్రటరీ నుంచి ఆఫర్ వచ్చింది. ఒక మ్యాచ్లో 8 వికెట్లు తీయడంతో నన్ను సమ్మర్ క్యాంప్కు సెలెక్ట్ చేశారు. అయితే, క్యాంప్ తొలి రోజే ఓ కోచ్ నన్ను పిలిచి నీ క్రికెట్ షూస్ ఎక్కడా? అని అడిగారు. షూ కూడా లేకుండా ఇక్కడకు వచ్చావా? అని అరుస్తూ అందరినీ పిలిచాడు. ఈ అబ్బాయికి కనీసం స్పైక్స్ షూస్ అంటే ఏమిటో కూడా తెలియదు అని వెక్కిరించాడు. ఆయన మాటలు నన్ను చాలా బాధ పెట్టాయి. దాంతో, ఆరోజే క్రికెట్ వదిలేద్దామని అనుకున్నా. కానీ అలాంటి మాటలు పట్టించుకోవద్దని ఫ్రెండ్స్ నచ్చజెప్పారు’ అని యాదవ్ చెప్పుకొచ్చాడు.
వాళ్లకు బౌలింగ్ చేయాలనగానే వణికిపోయా
యంగ్ ఏజ్లో చాలా కష్టపడిన ఉమేశ్కు దులీప్ ట్రోఫీలో ఆడే అవకాశం లభించింది. దీనికి చాలా సంతోషించినా.. ప్రత్యర్థి జట్టులో ఉన్న ఆటగాళ్లెవరో తెలియగానే భయపడ్డానని ఉమేశ్ చెప్పాడు.‘దులీప్ ట్రోఫీలో మ్యాచ్ ఆడేందుకు వెళ్లినప్పుడు నేను ద్రవిడ్, లక్ష్మణ్ వంటి బ్యాట్స్మెన్కు బౌలింగ్ చేయాలని తెలుసుకొని ఒక్కసారిగా వణికిపోయా. వాళ్లు ఈ బుడ్డోడిని (తనను) చంపేస్తారు అనుకున్నా. కానీ, అంత ఒత్తిడిలోనూ మంచి స్పెల్ వేస్తానని నేను అస్సలు ఊహించలేదు. ఆ మ్యాచ్లో ఐదు వికెట్లు తీయడంతో పాటు ద్రవిడ్, లక్ష్మణ్ను ఔట్ చేశా. అది నా కాన్ఫిడెన్స్ను అమాంతం పెంచింది’ అని ఈ నాగ్పూర్ బౌలర్ వివరించాడు. ఇక, తన ఫ్యూచర్పై అస్సలు బెంగ పెట్టుకోవడం లేదని ఉమేశ్ స్పష్టం చేశాడు.