ఆర్టీసీ కార్మికులు బాధ్యతా యుతంగా విధుల్లో చేరాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కోరారు. కార్మికులు డిమాండల్లో కొన్ని ఆర్థిక, మరికొన్ని సంక్లిష్టమైనవి ఉన్నాయి.. కార్మికుల డిమాండ్లను నెరవేర్చేందుకు 4 వారాల గడువు కోరుతున్నామని అన్నారు. ఈలోగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి బాధ్యతగా విధుల్లో చేరాలన్నారు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి.
రాష్ట్రప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు విఫలం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు అర్థరాత్రినుంచి సమ్మెకు వెళ్లారు. సమ్మె ప్రభావంతో మొదటి షిఫ్ట్ నుంచి ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. అయితే ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించకుండాప్రజలు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
మంగళవారం సాయంత్రం సెక్రటేరియట్ లో ఆర్టీసీ జేఏసీ నేతలతో ఐఏఎస్ ల కమిటీ చర్చలు జరిపింది. రాత్రి 9.30 గంటల వరకు పలు సమస్యలపై చర్చలు సాగినా చివరకు పలు డిమాండ్లపై జేఏసీ నేతలకు స్పష్ట మైన హామీ లభించకపోవడంతో చర్చలునుంచి బయటికొచ్చారు. వెంటనే జేఏసీ నిర్ణయం ప్రకారం సమ్మె కొనసాగుతుందని ప్రకటించారు. కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని.. గత్యంతర లేక సమ్మెకు దిగుతున్నట్లు జేఏసీ నేతలు తెలిపారు.

