చదువు చెప్పే సార్లు కరువైతున్నరు..యునెస్కో సర్వే

చదువు చెప్పే సార్లు కరువైతున్నరు..యునెస్కో సర్వే

పిల్లలకు చదువు చెప్పే సార్లు కరువైతున్నరు. సమాజానికి మంచి పౌరులనందించే టీచర్లయ్యేందుకు యూత్‌‌ ఇష్టపడట్లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలోనూ ఇలాంటి పరిస్థితే. అక్టోబర్‌‌ 5న ప్రపంచ టీచర్ల దినోత్సవం సందర్భంగా టీచర్ల కొరతను, వాళ్లు పడుతున్న కష్టాలను కళ్లకు కట్టింది యునెస్కో. చాలా దేశాల్లో టీచర్లు తక్కువగా ఉన్నారని, కొన్ని చోట్ల ఉన్నా తక్కువ జీతం ఇస్తున్నారని చెప్పింది. యునెస్కో ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ స్టాటిస్టిక్స్‌‌ (యూఐఎస్‌‌) ఈ లెక్కలన్నీ తీసింది. సబ్‌‌ సహారా దేశాల్లో 70 శాతం వరకు టీచర్ల కొరత ఉందని, సెకండరీ ఎడ్యుకేషన్‌‌ స్థాయిలో ఇది 90 శాతం వరకు ఉందని వెల్లడించింది. 2030 ఎడ్యుకేషన్‌‌ ఎజెండాను చేరుకోడానికి ప్రపంచవ్యాప్తంగా 6.9 కోట్ల మంది టీచర్లు అవసరమని పేర్కొంది. ఉత్సాహ పరిచే, ప్రోత్సహించే యంగ్‌‌ టీచర్లు లేకపోతే కోట్లాది స్టూడెంట్లు నాణ్యమైన చదువును  కోల్పోతారని, కోల్పోతూనే ఉంటారని చెప్పింది. సరైన జీతాలివ్వకపోతే కొత్త వాళ్లతో పాటు ఉన్న వాళ్లను కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించింది. అందుకే టాలెండ్‌‌ యూత్‌‌ టీచర్‌‌ వృత్తినే ముందు ఎన్నుకునే దిశగా ప్రయత్నం చేస్తామని, ఈ ఏడాది తమ ఎజెండా ఇదేనని చెప్పింది. ఈ ఏడాది వరల్డ్‌‌ టీచర్స్‌‌ డే థీంను కూడా ‘యంగ్‌‌ టీచర్స్‌‌, ద ఫ్యూచర్‌‌ ఆఫ్‌‌ ప్రొఫెషన్‌‌’గా పెట్టింది.

దేశంలో 12.8 లక్షల మంది టీచర్లు

ఇండియాలో మగ టీచర్లతో పోలిస్తే లేడీ టీచర్లు తక్కువున్నారని హయ్యర్‌‌ ఎడ్యుకేషన్‌‌ రిపోర్టు 2017–18 చెప్పింది. దేశంలో లేడీ టీచర్ల కన్నా మగ టీచర్లు 2.05 లక్షల మంది ఎక్కువున్నారని, దేశవ్యాప్తంగా 12.8 లక్షల మంది టీచర్లుంటే 57.9 శాతం మగ టీచర్లేనని పేర్కొంది. ఎడ్యుకేషన్‌‌ పై స్థాయికి పోతున్నా కొద్దీ ఈ జెండర్‌‌ గ్యాప్‌‌ మరింత పెరుగుతోందని వెల్లడించింది. లేడీ టీచర్లు తక్కువున్న రాష్ట్రాల్లో బీహార్‌‌ ముందుంది. ఈ రాష్ట్రంలో 20.9 శాతం మందే లేడీ టీచర్లున్నారు. ఆ తర్వాత జార్ఖండ్‌‌లో 29.8 శాతం మంది ఉన్నారు. మహారాష్ట్రలో 39.7 శాతం, ఒడిశాలో 35.7 శాతం, తెలంగాణలో 38.3 శాతం, యూపీలో 32.8 శాతం, పశ్చిమ బెంగాల్‌‌లో 34.5 శాతం టీచర్లున్నారని నివేదిక వెల్లడించింది. దాద్రానగర్ హవేలీలో మాత్రం 96 శాతం మంది మహిళా టీచర్లే ఉన్నారని రిపోర్టు పేర్కొంది. అక్కడ మొత్తం 205 మహిళా టీచర్లున్నారంది. కేరళలో 60.9 శాతం, చండీగఢ్‌‌లో 58.6, ఢిల్లీలో 56.1, పంజాబ్‌‌లో 55.4, గోవాలో 54.9, హర్యానాలో 52.3 శాతం లేడీ టీచర్లు ఉన్నారని పేర్కొంది.