హైదరాబాద్: ఆరోగ్య కల్పన విషయంలో ఒక్క ప్రభుత్వానిదే బాధ్యత కాదని, అందులో ప్రైవేట్ భాగస్వామ్యం కూడా చాలా అవసరమని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఈ రోజు హైదరాబాద్ లోని తాజ్ క్రిష్ణా హోటల్లో 13వ AAPI హెల్త్ కేర్ సమ్మిట్ 2019 ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా వైద్య సేవలు అందించడంలో ఎన్ ఆర్ ఐ వైద్యులు కీ రోల్ పోషిస్తున్నారన్నారు. హైదరాబాద్ లో ఉత్తమ వైద్యం అందించే టాప్ హాస్పిటల్స్ అందుబాటులో ఉన్నాయన్నారు.
అంటువ్యాధులు విజృంభించకుండా అధికారులైనా, ప్రజలైనా ముందస్తు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరముందని వెంకయ్యనాయుడు అన్నారు.అందుకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అన్నారు. వైద్యులు చికిత్స అందించడమే కాకుండా ప్రజల్లో ఆరోగ్య అవగాహన క్యాంపులు నిర్వహించాలని తెలిపారు. విదేశాల్లో వున్నా, మాతృ దేశ ఆహారపు అలవాట్లు మరిచిపోవద్దని, విదేశి సంస్కృతి, సంప్రదాయాల్లో పడి స్వదేశీ సంప్రదాయాలను మరువకూడదన్నారు.
ఇవాల్టి నుండి మూడు రోజుల పాటు జరుగనున్న ఈ సమ్మిట్ కు ఈ ఉదయం పలు రాష్ట్రాల వైద్యులు హాజరయ్యారు.