
అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం సిరిచెల్మలో ఫారెస్ట్ సిబ్బందిపై కేశవపట్నం గ్రామానికి చెందిన కొందరు దాడి చేశారు. కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో పలువురు ఫారెస్ట్ సిబ్బందికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అటు గ్రామస్తుల దాడిలో తీవ్రంగా గాయపడిన అటవీ సిబ్బంది..పోలీసులకు ఫిర్యాదు చేయడంతో..కేసు నమోదు చేశారు.
అసలేమైంది..
కేశవపట్నం గ్రామానికి చెందిన పలువురు..సిరిచెల్మ టైగర్జోన్ అటవీ పరిధిలో ఏప్రిల్ 12వ తేదీ బుధవారం అక్రమంగా మట్టిని తరలిస్తుండగా అటవీ శాఖ అధికారి వాహబ్ అహ్మద్ తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు.ఆ తర్వాత ట్రాక్టర్ ను సీజ్ చేసి..అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. అయితే ఫారెస్ట్ ఆఫీసులో ఉన్న ట్రాక్టర్ ను యజమానితో పాటు అతడి బంధువులు ఎత్తుకెళ్లారు. ఈ ట్రాక్టర్ సిరిచెల్మలో ఉన్నట్లు గుర్తించిన అటవీ సిబ్బంది..ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో అటవీ సిబ్బందికి, ట్రాక్టర్ యజమానితో పాటు అతడి బంధువుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే వారు ఫారెస్ట్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అటవీ సిబ్బందికి గాయాలయ్యాయి.