మా వాళ్లపై తప్పుడు కేసులు పెట్టారు : రాజాసింగ్

మా వాళ్లపై తప్పుడు కేసులు పెట్టారు : రాజాసింగ్

ఎల్ బీ నగర్,వెలుగు : తమ కుమారులపై తప్పుడు కేసులు బనాయించి 4 రోజులుగా పోలీస్ స్టేషన్ లో బంధించారని ఆరోపిస్తూ  వారి తల్లిదండ్రులు, బంధువులతో కలిసి హయత్ నగర్ పీఎస్  ముందు ఆదివారం ఆందోళనకు దిగారు. చౌటుప్పల్ కు చెందిన తోనేశ్వర్, గుండ్రంపల్లి చెందిన రాజు  కొన్ని రోజులుగా ముఠాగా ఏర్పడి రోడ్డుపై గోవులను తరలిస్తున్న వెహికల్స్ ను ఆపి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న కంప్లయింట్ తో హయత్ నగర్ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

ఈ కేసులో హిందువాహిని కార్యకర్తలైన భువనగిరికి చెందిన కేతురాజ్ మహేశ్,  తురుపాటి గిరీశ్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో వారి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేశారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వారికి మద్దతుగా నిలిచారు. పోలీసులతో మాట్లాడిన ఆయన..హిందువాహిని కార్యకర్తలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. మరోవైపు తమ దగ్గర పూర్తి ఆధారాలున్నాయని..వసూళ్లకు పాల్పడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేశామని..ఏసీపీ గాంధీనారాయణ చెబుతున్నారు.