
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు వెల్స్పన్ గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం సెక్రటేరియేట్లో వెల్స్పన్ గ్రూప్ చైర్మన్ బి.కె. గోయెంకా, వారి ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. పరిశ్రమల అభివృద్ధికి, పెట్టుబడులను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఫ్రెండ్లీ పాలసీని అనుసరిస్తుందని తెలిపారు.
పరిశ్రమలకు తమ ప్రభుత్వ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని సీఎం చెప్పారు. వెల్స్పన్ గ్రూప్ చైర్మన్ బీకే గోయెంకా మాట్లాడుతూ..తమ కంపెనీ తరఫున భవిష్యత్తులో చందనవెల్లి పారిశ్రామిక ప్రాంతంలో ఐటీ సేవల రంగంలో రూ.250 కోట్ల పెట్టుబడి పెడతామని వివరించారు. టైర్ 2, టైర్ 3 సిటీల్లో ఐటీ పరిశ్రమలను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
వికారాబాద్, అదిలాబాద్ జిల్లాల్లోని యువతకు ఐటీ ఉద్యోగాలు కల్పించేందుకు తమ కంపెనీ సిద్ధంగా ఉన్నదని వెల్లడించారు. ఈ సమావేశంలో సీఎస్ శాంతికుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, స్పెషల్ సెక్రటరీ డాక్టర్ విష్ణు రెడ్డి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, వెల్స్పన్ గ్రూప్ హెడ్ (కార్పొరేట్ వ్యవహారాలు) చింతన్ థాకర్ తదితరులు పాల్గొన్నారు.