సింగరేణిలో కొత్త నియామకాలెప్పుడో?

సింగరేణిలో కొత్త నియామకాలెప్పుడో?
  • ఏడేండ్లుగా భర్తీకాని డైరెక్ట్​ క్లరికల్, మైనింగ్​ పోస్టులు

 

  • యాక్టింగ్​ క్లర్క్​లకు ఇంకా మజ్దూర్​ జీతాలే


మందమర్రి, వెలుగు: సింగరేణిలో ప్రతి ఏటా కార్మికుల సంఖ్య తగ్గిపోతుండగా.. ఖాళీలను మాత్రం భర్తీ చేయడం లేదు. దాంతో ఉన్నవారిపైనే పని భారం పడుతోంది. సింగరేణి వ్యాప్తంగా కీలక కేటగిరిల్లో సుమారు 4 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డైరెక్ట్​ నియామకాలు చేయని సింగరేణి యాజమాన్యం కార్మికుల హక్కుగా ఉన్న కారుణ్య నియామకాల ద్వారా వారసులకు జాబ్​ కల్పిస్తూ వాటినే కొత్త ఉద్యోగాలుగా చెబుతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత డైరెక్ట్​ నోటిఫికేషన్​ ద్వారా 3,498 మందికి ఉద్యోగాలు కల్పించగా కారుణ్యం ద్వారా 12,553 మంది సింగరేణిలో చేరారు. 

-క్లర్కుల భర్తీ ఎప్పుడో..

సింగరేణి వ్యాప్తంగా  బొగ్గు గనులు,  మ్యాన్​వే, జీఎం ఆఫీస్​లు, మ్యాగ్జిన్, వేబ్రిడ్జి, పే షీట్, వెల్ఫేర్, స్టోర్స్, బిల్స్, పర్చేజ్, ఆర్డర్స్, కో ఆర్డినేషన్స్, సెటిల్​మెంట్లు, అడిట్, జీతభత్యాలు, ప్రమోషన్లు, సర్వీసు తదితర రంగాల్లో 1,600 మంది క్లర్కులు పని చేస్తున్నారు.  సీనియర్​ క్లర్కులు చాలామంది ఇటీవల రిటైర్​అయ్యారు. వారి స్థానంలో కొత్తవారిని తీసుకోకపోవడంతో ఇద్దరు, ముగ్గురు చేయాల్సిన పనులు ఒక్కరే చేయాల్సి వస్తోంది. సుమారు 1,200 మంది వరకు క్లర్కుల కొరత ఉంది. చాలామంది క్లర్క్​లు  30 నుంచి 40 ఏళ్ల కిందట నియమితులైనవారు ఉన్నారు. వీరికి కంప్యూటర్లపై పూర్తి అవగాహన లేదు. డిప్యుటేషన్​పై డ్యూటీ చేస్తున్న సిబ్బందికి పని విధానం తెలియకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఉన్నత చదువులు చదివి, కంప్యూటర్​పై అవగాహన కలిగిన 1000 మందికిపైగా జనరల్​ మజ్దూర్ కార్మికులను యాక్టింగ్​ క్లర్కులుగా ఉపయోగించుకుంటున్నారు. గత ఏడాది  మరో 177 మంది ఎక్స్​టర్నల్​ క్లర్కులను మార్చి నెలలోగా నియమిస్తామని చెప్పినా ఇప్పటివరకు ఆ ఊసే లేదు. యాక్టింగ్ ​క్లర్కులుగా చేస్తున్నవారికి మజ్దూర్​ జీతమే చెల్లిస్తున్నారు. పర్మినెంట్ ​క్లర్క్​కు రూ.29 వేల బేసిక్​ వస్తే యాక్టింగ్ ​క్లర్క్​కు రూ.18 వేలు దాటడం లేదు.

-ఏళ్లుగా సూపర్​వైజర్ల పోస్టులు ఖాళీ

బొగ్గు గనుల్లో ఉత్పత్తి ప్రక్రియ, సేఫ్టీ పూర్తిగా మైనింగ్​సూపర్​వైజర్స్​ చూసుకోవాల్సి ఉంటుంది.  సింగరేణిలో 24 అండర్​గ్రౌండ్​ మైన్లు, 20 ఓసీపీలున్నాయి. గనుల్లో ఒక్కో పనిస్థలంలో షార్ట్​ఫైరర్, సర్దార్, ఓవర్​మెన్​ ఉంటేనే అక్కడ పనులు నిర్వహించాల్సి ఉంటుంది. గనిలో షిఫ్టుకు కనీసం 10 మంది ఓవర్​మెన్​లు, 20 మంది సూపర్​వైజర్ల చొప్పున రోజుకు మూడు షిప్టుల్లో అవసరముంటుంది. ​ వీరు కార్మికులతో పనులు చేయించడంతో పాటు పనిస్థలంలో ఉత్పత్తి ఎంత వస్తోంది, సేఫ్టీ తదితర అంశాలపై పర్యవేక్షణ చేస్తారు.  ఓవర్​మెన్​ రెండు నుంచి మూడు పని స్థలాలను పర్యవేక్షిస్తారు. సర్దార్​లు ఒక పనిస్థలంలో సూపర్​వైజర్​లుగా చేస్తే.. వారికి అసిస్టెంట్లుగా షార్ట్​ఫైరర్​లు ఉంటారు. సింగరేణి వ్యాప్తంగా 3వేల మంది సూపర్​వైజర్ల అవసరముంటుంది. ఏటా ఎంప్లాయీస్  రిటైర్​కావడంతో వీరి సంఖ్య కేవలం 900కు పరిమితమైంది.  మరో 650 మంది జేఎంఈటీలు ఉన్నారు. సరైన సూపర్​వైజింగ్​లేక గనుల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏడేండ్ల  కిందట650 మంది జేఎంఈటీ(మైనింగ్​)లను నియమించిన యాజమాన్యం ఇప్పటివరకు మళ్లీ పోస్టులు భర్తీ చేయలేదు.  

-ఇంటర్నల్ పోస్టుల భర్తీ రూల్స్​పై గుర్రు

సింగరేణి యాజమాన్యం తాజాగా 155 ఇంటర్నల్​జూనియర్​అసిస్టెంట్​పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​జారీ చేసింది. ఇందులో పాతవి 96 పోస్టులు ఉన్నాయి. 96 పోస్టులు పూర్తిగా మహిళలకే కాగా.. మిగిలిన 59 పోస్టుల్లో కూడా 33శాతం ఫిమేల్​కు కేటాయించారు. మొత్తంగా 115 పోస్టులు ఫిమేల్​ ఎంప్లాయీస్ కు దక్కనున్నాయి. మిగిలిన 42 పోస్టులకు వందల మంది మేల్​ఇంటర్నల్​ ఎంప్లాయీస్ పోటీ పడాల్సిందే. గతంలో రూల్​ప్రకారం 5 ఏళ్లు సీనియరిటీ​ ఉన్నవారికి చాన్స్ ఉంటే ఇప్పుడు 190/240 మస్టర్లు ఉన్న వారికి కూడా అవకాశం ఇచ్చారు. దీని వల్ల  సీనియర్లకు తీరని అన్యాయం జరుగుతుందని కార్మికసంఘాలు పేర్కొంటున్నాయి.  

అన్ని పోస్టులు భర్తీ చేయాలె

యాక్టింగ్ ​క్లర్క్​లుగా చేస్తున్న ఎంప్లాయీస్​కు వన్​టైమ్​సెటిల్​మెంట్​కింద జూనియర్​అసిస్టెంట్లుగా చాన్స్​ఇవ్వాలె. ఖాళీగా ఉన్న  అన్ని ఇంటర్నల్, ఎక్స్​టర్నల్​ పోస్టులు భర్తీ చేయాలె.
- ఎస్​.వెంకటస్వామి, సీఐటీయూ లీడర్