ప్రగతి భవన్ ముట్టడికి పిలుపు.. ఆటో డ్రైవర్ల ముందస్తు అరెస్టు

ప్రగతి భవన్ ముట్టడికి పిలుపు.. ఆటో డ్రైవర్ల ముందస్తు అరెస్టు
  • యాదగిరిగుట్టపైకి ఆటోలను అనుమతించాలంటూ ఛలో ప్రగతి భవన్ కు పిలుపు
  • అర్ధరాత్రి నుండి ముందస్తు అరెస్టులు 

యాదాద్రి: యాదగిరిగుట్టలో ఆటో డ్రైవర్లను ముందస్తు అరెస్టు చేస్తున్నారు. కొండ పైకి ఆటోలను అనుమతించాలనే డిమాండ్ తో రెండు నెలలుగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన ఆటో కార్మికులు ఇవాళ ప్రగతిభవన్  ముట్టడికి పిలుపునిచ్చిన నేపధ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆటో డ్రైవర్ల యూనియన్ నాయకులతోపాటు.. నిరసనల్లో చురుగ్గా పాల్గొంటున్న వారిని ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. 
సుమారు ఆరేళ్లకుపైగా యాదగిరిగుట్ట ఆలయం పునరుద్ధరణ పనులు పూర్తయిన తర్వాత భక్తులందరికీ దర్శనాలు ప్రారంభించిన తర్వాత తమ ఆదాయం పెరుగుతుందని భావిస్తే.. పొట్ట కొట్టేలా చేస్తున్నారని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి వచ్చిన ప్రముఖులకు తమ నిరసన తెలియజేస్తూ.. రెండు నెలలుగా వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాము ఎంతో కష్టాల్లో ఉన్నామని చెబుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆందోళన ఉదృతం చేయాలని నిర్ణయించిన ఆటో డ్రైవర్లు.. ఇవాళ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అర్ధరాత్రి నుంచే ఆటోడ్రైవర్లను ఎక్కడికక్క అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 22 మంది ఆటో డ్రైవర్లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసుల అరెస్టులను గుర్తించిన ఆటో డ్రైవర్లలో పలువురు ఆటోలను ఇళ్ల వద్దే వదిలి ప్రగతిభవన్ కు బయలుదేరినట్లు తెలుస్తోంది.