- 5, 6 చదివినోళ్లు మంత్రులైతే.. పీజీలు చేసినోళ్లు కూలీలైన్రు
- రూ.5 వేల రైతుబంధు ఇచ్చి సాగు సబ్సిడీలన్ని ఎత్తేశారు: షర్మిల
- తెచ్చిన అప్పుల్లో అధికం కేసీఆర్ఫ్యామిలీనే మింగేసిందని ఫైర్
యాదాద్రి, వెలుగు: ‘‘ఐదు, ఆరు తరగతులు చదివినోళ్లు మంత్రులయ్యారు. కేసీఆర్ ఫ్యామిలీ అయితే చాలు మంత్రులయ్యారు. డిగ్రీ, పీజీలు చేసినోళ్లు మాత్రం ఉద్యోగాలు రాక హమాలీలుగా బస్తాలు మోస్తున్నరు. చాయ్ అమ్ముకుంటున్నరు” అని వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల అన్నరు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా శుక్రవారం యాదాద్రి జిల్లా మోత్కురు మండలం కొండగడప, పాటిమట్ల, దాచారంలో ప్రజలను పలకరించి కష్టాలు తెలుసుకున్నారు. అడ్డగూడూరు మండలంలోని డీ రేపాకకు చేరుకొని మాట ముచ్చట నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ వరి వేయొద్దనే చేతకాని దిక్కుమాలిన ప్రభుత్వం, చేతకాని సీఎం కేసీఆర్ అవసరమా? అంటూ ప్రశ్నించారు. రైతుబంధు పేరుతో రూ.5 వేలు బిచ్చం వేస్తూ సబ్సిడీలు అన్ని ఎత్తేశారని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ, ఇక్కడ కేసీఆర్ పోటాపోటీగా చార్జీలు పెంచుతూ ప్రజల రక్తం పీలుస్తున్నారని ఆరొపించారు. బీజేపీ, కేసీఆర్ ఒకే తాను ముక్కలని అభివర్ణించారు. వడ్లు కొనాల్సిన సీఎం, కేంద్రమే కొనాలంటూ ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి పేరుతో తెచ్చిన అప్పుల్లో ఎక్కువ భాగం కేసీఆర్ ఫ్యామిలీ మింగేసి, అప్పుల తెలంగాణగా మార్చారంటూ ఆరోపించారు. వైఎస్ హయాంలో 46 లక్షల ఇండ్లు కడితే, కేసీఆర్ 40 వేలు కూడా కట్టలేదన్నారు. ఎన్నికలు దగ్గరకు రాగానే.. బీసీబంధు అంటూ కేసీఆర్ నమ్మిస్తారని తెలిపారు. ఇప్పటికే కేసీఆర్ను రెండుసార్లు గెలిపించి మోసపోయారని, మరోసారి మోసపోవద్దన్నారు. తెలంగాణ ప్రజల కోసమే తాను పార్టీ పెట్టానని, వచ్చే ఎన్నికల్లో తమను దీవించాలని కోరారు. తాము అధికారంలోకి రాగానే ఉచితంగా విద్య, వైద్యం అందిస్తామని, వైఎస్ సంక్షేమ పాలన తెస్తామని
షర్మిల హామీ ఇచ్చారు.