అమీర్ పేటలో ఇనిస్టిట్యూట్లు ఎత్తేస్తున్నరు

అమీర్ పేటలో ఇనిస్టిట్యూట్లు ఎత్తేస్తున్నరు
  • ఆన్​లైన్ క్లాసులైనా సంస్థలకు నిర్వహణ భారం
  • ఇప్పటి వరకు మూతబడినవి 300లకు పైనే..
  • కొంత కాలం దాకా ఇదే పరిస్థితి  

హైదరాబాద్, వెలుగు : ఐటీ జాబ్​లు,  ఫారిన్ ​కలలతో అమీర్ పేటలో అడుగు పెట్టని బీటెక్ స్టూడెంట్స్​ ఉండరు. ఓ వైపు క్రాష్ , ఫాస్ట్ ట్రాక్ కోర్సులు. మరో వైపు బ్యాంకింగ్, ఎస్ఎస్​సీ, రైల్వే జాబ్​లకు ట్రైనింగ్​ ఇచ్చే ఇనిస్టిట్యూట్లతో ఎస్ఆర్ నగర్, అమీర్ పేట ఏరియాలు సందడిగా ఉండేవి. కరోనా కారణంగా స్టూడెంట్లు ఇంటి బాటపడితే, ఇనిస్టిట్యూట్లకు వచ్చేవారు లేక రెండేండ్లుగా నిర్వహణ భారమవడంతో  బందైపోతున్నాయి.  అమీర్​పేటలోని 83 కాంప్లెక్స్​ల్లో  బల్దియా లెక్కలు ప్రకారం 1,871 ఇనిస్టిట్యూట్లు ఉండగా ఇప్పటికే 300కుపైగా మూతపడ్డాయి. ట్రైనింగ్ సెంటర్లు కూడా ఆన్ లైన్ కోర్సులు, ప్రత్యేక యాప్ ల ద్వారా ఈ–లెర్నింగ్​లో చెబుతుండగా  ఇనిస్టిట్యూట్లకు వచ్చేవారు తగ్గిపోయారు.  వాటి కార్యకలాపాలను ఆన్ లైన్ కు మారడంతో కొన్ని సెంటర్లు ఖాళీ చేయగా.. మరికొన్ని సంస్థల్లో  స్టూడెంట్లు  లేక కంప్లీట్​గా క్లోజ్​ చేశారు. 
లాక్​డౌన్​ ఆంక్షలతో..
కరోనా ఫస్ట్​వేవ్ టైమ్​లో అమీర్​పేట ఎక్కువ కేసులతో చర్చనీయాంశంగా మారింది.  అప్పటి నుంచి హాస్టళ్లలో ఆంక్షలు, ఇనిస్టిట్యూట్ల జాగ్రత్తలకు తోడు వర్క్ ఫ్రం హోమ్​ పద్ధతిలో ఐటీ కంపెనీలు పని చేస్తున్నాయి. దీంతో ఫిజికల్ క్లాసుల సందడి తగ్గుముఖం పట్టింది. లాక్ డౌన్ ఆంక్షలతో 3 నెలల పాటు మూసి వేయగా ఇప్పటివరకు కోలుకోలేదు. గతేడాది జూన్ నుంచి కేసులు తగ్గుముఖం పట్టడంతో విద్యార్థుల రాక మొదలైనా, ఐటీ కంపెనీల కార్యకలాపాల ట్రైనింగ్​కు వచ్చేవారు క్రమంగా తగ్గిపోయారు. ముఖ్యంగా బీటెక్ స్టూడెంట్స్​ చదువులు కూడా ఆన్ లైన్ లో సాగుతుండడంతో అమీర్ పేట కు రావాల్సిన అవసరమే లేకుండా పోయింది. 
ఇప్పటికీ ఆన్ లైన్ లోనే.. 
కాంప్లెక్స్​ సెల్లార్లు, కమ్యూనిటీ భవనాలు, ఫంక్షన్ హాళ్లలో ఒకేసారి వేలాది మందితో క్లాసులు నిర్వహించిన సంస్థలు కరోనా దెబ్బకు తేరుకోలేదు. లాక్ డౌన్ నుంచి ఇప్పటివరకు ఆన్ లైన్ లోనే క్లాసులు నిర్వహిస్తున్నాయి.  కొన్ని బేసిక్ సీ, సీ ప్లస్, జావా, డాట్ నెట్ వంటి బేసిక్ కోర్సులను పూర్తిగా ఎత్తివేయగా, డిమాండ్ ఉండే పైథాన్, ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి కోర్సులను అందించే సంస్థలు కూడా ఆన్ లైన్ లోనే క్లాసులను కొనసాగిస్తున్నాయి.   సిటీలో అమీర్ పేట్, కూకట్ పల్లి, హిమాయత్ నగర్, దిల్ సుఖ్ నగర్ వంటి ఏరియాల్లోని బ్రాంచ్​లను కూడా తగ్గించుకున్నాయి. దీంతో ఐదారు బ్రాంచ్​ల్లో ట్రైనింగ్ అందించే సంస్థలు ఒక్క సెంటర్ నుంచి అడ్మినిస్ట్రేషన్ నడుపుతుండగా, క్లాసులను మాత్రం ఆన్​లైన్​లో నిర్వహిస్తున్నాయి. 
నిర్వహణ భారమని..
గతేడాది మే నుంచి ఫిజికల్ క్లాసులకు కొత్త బ్యాచ్​లను ప్రారంభించినా స్టూడెంట్లు  రాలేదు. దీంతో కోర్సు మధ్యలో ఉన్న వారికి వీలుగా ఆన్ లైన్​లోనే  రన్ చేశామని నారాయణ టెక్ సొల్యూ
షన్ నిర్వాహకుడు లక్ష్మణ్ చెప్పాడు.  స్టూడెంట్లు కూడా ఫిజికల్ క్లాసుల కంటే ఆన్​లైన్ క్లాసులకు ఇంట్రెస్ట్​​ చూపిస్తుండటంతో నిర్వహణ భారమని మూసివేస్తున్నట్లు పలు ఇనిస్టిట్యూట్ల నిర్వాహ
కులు  చెప్తున్నారు. ఇప్పటికీ హోటల్ మేనేజ్​మెంట్, బేసిక్ ఐటీ కోర్సులను నేర్చుకునేందుకు ఎవరూ ఇంట్రెస్ట్ చూపట్లేదని అంటున్నారు. చాలా వరకు బీటెక్ కాలేజీలు బేసిక్ కోర్సులపై పూర్తి ట్రైనింగ్ ఇస్తుండడం ఇనిస్టిట్యూట్లకు ఆదరణ లేకపోవడానికి కారణమంటున్నారు. 
రెంట్లు తగ్గించాలని..
అమీర్​పేటలోని హెచ్ఎండీఏ, బల్దియా కాంప్లెక్స్​ల్లో క్లాసులు నిర్వహించే సంస్థలు రెంట్లు రద్దు చేయాలని ఆయా సంస్థలను కోరాయి.  అగ్రిమెంట్ ముగిసిన సంస్థలు మరికొంత కాలం పొడిగించాలని విన్నవించాయి. ప్రైవేటు కాంప్లెక్స్​ల్లోని ఇనిస్టిట్యూట్లకు అవకాశం లేకపోగా ఎత్తేసుకున్నవారు ఉన్నారు. స్టూడెంట్లు లేకుండా, క్లాసులు నడవకుండా రెంట్లు కట్టడం దేనికని మూసివేయగా,  ఆన్ లైన్ లో మాత్రమే క్లాసులు నిర్వహిస్తామని చెప్పిన చేతులు ఎత్తేసిన సంస్థలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇలా నిర్వహణ భారానికి భయపడి మూసివేస్తుండడంతో ఇనిస్టిట్యూట్ల సంఖ్య తగ్గిపోతోంది. 

శాలరీకే కష్టంగా ఉంది
గతేడాదిన్నర వరకు శాలరీలు చెల్లించడానికే కష్టమైంది. ఒకప్పుడు లైనెక్స్, కోర్ జావా, అడ్వాన్స్ జావా కోసం వందల్లో స్టూడెంట్లు వచ్చి  ట్రైనింగ్​ తీసుకునేవారు.  కరోనా ఎఫెక్ట్​తో  ఐటీ కంపెనీల్లో ట్రైనింగ్ ఇన్ స్ట్రక్టర్ల సంఖ్య భారీగా తగ్గింది.  3 నెలల వరకు శాలరీల నిర్వహణకే కష్టమైంది. ఇప్పుడు ఫీజులు తగ్గించినా కొద్ది మందితోనే క్లాసులు రన్​ చేయాల్సి వస్తున్నది. 
                                                                                                                                                                                                                           - ప్రసన్న, ధరమ్ కరం రోడ్డులోని ఓ ఇనిస్టిట్యూట్ మేనేజర్

 బ్రాంచ్​లు తగ్గించగా జాబ్ పోయింది
మైత్రివనంలోని ఓ సాఫ్ట్ వేర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ లో ల్యాబ్ ఫ్యాకల్టీగా చేశా.  బీటెక్ పూర్తయ్యాక, ఎంటెక్ చేస్తూనే దిల్ సుఖ్ నగర్ లోని బ్రాంచ్​లో జాయిన్​ అయి  ఏడాదిన్నరపాటు చేశా.  కరోనా ఫస్ట్ వేవ్ లో ఇండ్లకు వెళ్లడంతో శాలరీలు ఆపేశారు. ఆ తర్వాత తెరుచుకున్నా బ్రాంచ్​లను తగ్గించి, సిబ్బందిని సర్దుబాటు చేయడంతో జాబ్ పోయింది. 
                                                                                                                                                                                                                                                                       - మల్లికార్జున్, హైదరాబాద్