
కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మే 20వ తేదీ సోమవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది.సెక్రటేరియట్ లో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరుగనుంది. కేబినెట్ భేటీకి కొన్ని షరతులతో ఇవాళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈసీ.
అత్యవసర అంశాలపైనే చర్చించాలని సూచించింది. జూన్ 4వ తేదీ వరకు వేచి ఉండలేని అంశాలపై కేబినెట్ లో డిస్కస్ చేయాలని చెప్పింది. ఎన్నికల డ్యూటీలో ఉన్న అధికారులెవరూ సమావేశానికి వెళ్లవద్దని ఆదేశించింది కేంద్ర ఎన్నికల సంఘం. రుణమాఫీ,ఉమ్మడి రాజధాని అంశాలను ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు వాయిదా వేయాలని తెలిపింది. ధాన్యం కొనుగోళ్లు, విద్యా సంవత్సరంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
కాగా, శనివారం జరగాల్సిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ఎలక్షన్ కమిషన్ అనుమతి రాకపోవడంతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. శనివారం మధ్యాహ్నం కేబినెట్ సమావేశం నిర్వహిం చాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోగా..ఎన్నికల్ కోడ్ అమల్లో ఉన్నందున అధికారులు ఈసీ అనుమతి కోరారు. అయితే శనివారం రాత్రి వరకు కూడా ఈసీ నిర్ణయం చెప్పకపోవడంతో కేబినెట్ భేటీ వాయిదా పడింది.