బీహార్ లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి, 12మందికి తీవ్ర గాయాలు

బీహార్ లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి, 12మందికి తీవ్ర గాయాలు

బీహార్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఓ హోటల్‌లో ఏప్రిల్ 25వ తేదీ గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం ఆరుగురు మరణించారని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజీవ్ మిశ్రా తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

భవనంలో చిక్కుకున్న దాదాపు 30 మందికి పైగా ప్రజలను రక్షించారని తెలిపారు.  గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారని చెప్పారు. ఈ ప్రమాదంలో మరణించినవారిని ఇంకా గుర్తించలేదని మిశ్రా తెలిపారు. కాగా, 12మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

సంఘటనా స్థలానికి చేరుకున్న డిఐజి (అగ్నిమాపక) మృత్యుంజయ్ కుమార్ చౌదరి మిడియాతో మాట్లాడుతూ.. "ప్రస్తుతం మంటలను అదుపులోకి తెచ్చాము. ప్రమాదంపై ఉదయం 11 గంటలకు సమాచారం అందింది. సరైన విచారణతో ఈ ప్రమాదానికి గత కారణాలను గుర్తిస్తాం" అని తెలిపారు. అయితే,  సిలిండర్ పేలుడు సంభవించడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.