నాగారం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్​పై అవిశ్వాస తీర్మానం

నాగారం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్​పై అవిశ్వాస తీర్మానం

మేడ్చల్ జిల్లా కలెక్టరేట్​లో ఫిర్యాదు చేసిన 14  మంది కౌన్సిలర్లు

శామీర్​పేట, వెలుగు: మున్సిపాలిటీలో చైర్మన్, వైఎస్ చైర్మన్​పై అవిశ్వాసానికి సొంత పార్టీ నేతలే ఉత్సాహం చూపారు.  మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్​కు చెందిన చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ బండారు మల్లేశ్ ​యాదవ్ పై సొంత పార్టీ కౌన్సిలర్లతోపాటు కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మద్దతు తీసుకుని అవిశ్వాసం పెట్టారు. సోమవారం కలెక్టరేట్​లో నోటీసును అందజేశారు. మొత్తం 20 మంది కౌన్సిలర్లు ఉండగా.. ఇందులో బీఆర్ఎస్ నుంచి10 మంది , కాంగ్రెస్ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఓ కౌన్సిలర్​తో మొత్తం 14 మంది సంతకాలు చేసిన అవిశ్వాస తీర్మానం నోటీసును డీఆర్వో హరిప్రియకు అందజేశారు.

అనంతరం అసమ్మతి కౌన్సిలర్లు మీడియాతో మాట్లాడుతూ, చైర్మన్, వైస్ చైర్మన్ ఒంటెత్తు పోకడలకు నిరసనగా, మున్సిపాలిటీ నిధులను తమ ఇష్టానుసారంగా కొన్ని ప్రాంతాలకే కేటాయిస్తూ.. అధిక ప్రాధాన్యత ఇచ్చారని, తమ వార్డులను విస్మరించారని ఆరోపించారు. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అవిశ్వాస తీర్మానం పెట్టామని అసమ్మతి కౌన్సిలర్లు తెలిపారు.  

తూంకుంట మున్సిపాలిటీలోనూ.. 

తూంకుంట మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్​పై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. 9 మంది బీఆర్ఎస్, ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు మొత్తం 11 మంది అవిశ్వాస తీర్మానం నోటీసును కలెక్టరేట్ ఏఓ గౌతమ్ పోట్రుకు అందజేశారు. ఇప్పటికే కౌన్సిలర్లు క్యాంప్ కు వెళ్లారు. వారు మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్​కు చెందిన  చైర్మన్, వైస్ చైర్మన్ అక్రమాలు తప్ప అభివృద్ధి పనులు చేపట్టలేదని ఆరోపించారు. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.