ఆమె కడుపు ఎప్పుడూ ఉబ్బెత్తుగా ఉండేది. గాలి కూడా తీసుకోలేకపోయేది. ఆస్పత్రికి పోదామంటే చేతిలో డబ్బులూ లేవు. ఆమె బాధ చూసి ఊరి జనం తలా ఇన్ని డబ్బులు పోగేసి ఆస్పత్రికి పంపించారు. అక్కడి డాక్టర్లు ఆమెకు టెస్టులు చేస్తే అండాశయంలో ఓ పెద్ద గడ్డ ఉందని తేలింది. అది పెరుగుతూ పెరుగుతూ కడుపు మొత్తాన్ని ఆక్రమించిందని డాక్టర్లు గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేసి తీసేయాలన్నారు. లేకపోతే ఆ గడ్డ కడుపులో పగిలిపోయి ప్రాణానికే ప్రమాదముందని హెచ్చరించారు. ఇటీవలే ఆపరేషన్ చేసి ఆ గడ్డను తీసేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని వార్ధాలో జరిగింది. బాధిత మహిళ పేరు కవితా కలాం (38). ఆచార్య వినోబా భావే ఆస్పత్రి వైద్యులు ఈ రిస్కీ ఆపరేషన్ చేశారు. 95 శాతం పొట్టను ఈ గడ్డ ఆక్రమించిందని ఆపరేషన్ చేసిన డాక్టర్ అర్పితా జైస్వాల్ సింగమ్ చెప్పారు. ఆ గడ్డ 18 కిలోల బరువుందని చెప్పారు. ఆపరేషన్కు ముందు 7 నెలల పాటు ఆమె తీవ్రంగా ఇబ్బంది పడిందని చెప్పారు. ఆ గడ్డ మొత్తం నీళ్లే ఉండడంతో ఆపరేషన్ చాలా రిస్కీ అని, కొంచెం అటూఇటైనా మహిళ ప్రాణానికే ప్రమాదం జరిగి ఉండేదని మరో డాక్టర్ అభిషేక్ కొథులే అన్నారు. కడుపు కింది భాగంలో 2 సెంటీమీటర్ల మేర కోసి గడ్డను బయటకు తీశామన్నారు. ఈ గడ్డను సిస్టడెనోమా అని పిలుస్తున్నారు. అయితే, ఇది కేన్సర్ గడ్డ కాదని డాక్టర్లు తేల్చారు.