హైదరాబాద్‌లో ఒక్కరోజే 30 కరోనా కేసులు

హైదరాబాద్‌లో ఒక్కరోజే 30 కరోనా కేసులు

హైదరాబాద్‌‌, వెలుగు: కరోనాతో రాష్ట్రంలో మరొకరు మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 30కి పెరిగింది. హైదరాబాద్‌‌ సరూర్‌‌నగర్‌‌కు చెందిన 60 ఏళ్లకు పైబడిన వ్యక్తి శనివారం గాంధీ దవాఖానలో ట్రీట్‌‌మెంట్‌‌ పొందుతూ చనిపోయారు. మృతుడు డయాలసిస్‌‌ పేషెంట్‌‌ అని హెల్త్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ వర్గాలు చెప్పాయి. ఈ రోజు కొత్తగా మరో 31 మందికి పాజిటివ్‌‌ వచ్చింది. వీరిలో 30 మంది గ్రేటర్‌‌ హైదరాబాద్‌‌కే చెందిన వారు కాగా మరొకరు వలస కార్మికుడు ఉన్నారు. శనివారం పాజిటివ్‌‌ వచ్చిన కేసుల్లో ఎక్కువ మంది గోల్కొండ ప్రాంతానికి చెందిన వారేనని తెలిసింది. మలక్‌‌పేట్‌‌ గంజ్‌‌ లింక్‌‌తో సంబంధమున్న మరికొన్ని కేసులు బయట పడ్డాయి. అంబర్‌‌పేట్‌‌లో ముగ్గురికి పాజిటివ్‌‌ వచ్చింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌‌ కేసుల సంఖ్య1,163కు చేరింది. 24 మంది హాస్పిటల్‌‌ నుంచి డిశ్చార్జి అయ్యారు. మొత్తం 751 మంది డిశ్చార్జి అయినట్టుగా హెల్త్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ బులెటిన్‌‌లో పేర్కొంది. రాష్ట్రంలో 382 యాక్టివ్‌‌ కేసులున్నాయని తెలిపింది.

23 జిల్లాల్లో కొత్త కేసుల్లేవ్.. 

వరంగల్‌‌ రూరల్‌‌, యాదాద్రి భువనగిరి, వనపర్తి జిల్లాలు జీరో పాజిటివ్‌‌గా ఉన్నాయి. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో గడిచిన14 రోజులుగా ఒక్క పాజిటివ్‌‌ కేసు కూడా నమోదు కాలేదు. డిశ్చార్జి అయిన వారిలో హైదారబాద్‌‌ జిల్లాకు చెందిన వారు12 మంది ఉండగా, గద్వాల జిల్లా వాసులు ముగ్గురు, సూర్యాపేట, ఆదిలాబాద్‌‌ జిల్లాలకు చెందిన వారు ఇద్దరు చొప్పున, వికారాబాద్‌‌, మేడ్చల్‌‌, రంగారెడ్డి, సిరిసిల్ల జిల్లాలకు చెందినవారు ఒక్కొక్కరు ఉన్నారు.