శ్మశాన వాటిక గోడ కుప్పకూలి.. ఇద్దరు బాలికలతో సహా ఐదుగురు మృతి

శ్మశాన వాటిక గోడ కుప్పకూలి.. ఇద్దరు బాలికలతో సహా ఐదుగురు మృతి

శ్మశాన వాటిక గోడ కుప్పకూలి ఐదుగురు మృతి చెందారు. ఈ విషాద సంఘటన హర్యాలోని గురుగ్రామ్ లో చోటుచేసుకుంది. ఏప్రిల్ 20వ తేదీ శనివారం మదన్‌పురి ప్రాంతంలోని రాంబాగ్ శ్మశానవాటిక వెనుక గోడ కూలి ఇద్దరు బాలికలతో సహా ఐదుగురు మృతి చెందారు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఆరుగురు వ్యక్తులు గోడ పక్కన కూర్చొని ఉండగా.. ఒక్కసారిగా వారిపై గోడ కుప్పకూలిపోయింది. పక్కనే ఆడుకుంటున్న ఇద్దరు బాలికలు కూడా శిథిలాల కింద చిక్కుకుపోయారు. 

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు బాలికలతోపాట మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరో వృద్ధుడిని వెంటనే చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  ఈ ఘటన సమయంలో సీసీఫుటేజీలో రికార్డు అయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈప్రమాదంలో  మృతి చెందిన వారిని మనోజ్ గబా(54), దేవిదయాల్ అలియాస్ పప్పు(70), కృష్ణ కుమార్ అలియాస్ బాబా డీజే(52), తాన్య(11), ఖుష్బూ (10)లుగా గుర్తించారు.

మదన్‌పురి శ్మశాన వాటిక మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యుల నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం జరిగిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు..  ఘటనాస్థలంలోని సీసీఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.