- 2021–22 లో క్రియేట్ అయ్యాయని పేర్కొన్న బెటర్ప్లేస్ రిపోర్ట్
- డెలివరీ, రిసెప్షనిస్ట్ వంటి ఫ్రంట్లైన్ ఉద్యోగాలకు ఫుల్ డిమాండ్ ఉందని వెల్లడి
బిజినెస్ డెస్క్, వెలుగు: దేశ ఎకానమీ తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటోంది. ఫలితంగా ప్రజల వినియోగం పెరుగుతోంది. దీంతో 2021–22 ఆర్థిక సంవత్సరంలో 80 లక్షల ఫ్రంట్లైన్ వర్కర్ ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయని రిపోర్ట్ ఒకటి వెల్లడించింది. డైరెక్ట్గా కస్టమర్తో ఇంటరాక్ట్ అయ్యే ఉద్యోగులను ఫ్రంట్లైన్ వర్కర్లు అంటున్నారు. బెటర్ప్లేస్ ఫ్రంట్లైన్ ఇండెక్స్ రిపోర్ట్ 2022 ప్రకారం, డెలివరీ, రిటైల్ సెగ్మెంట్లో ఫ్రంట్లైన్ వర్కర్లకు విపరీతమైన డిమాండ్ క్రియేట్ అయ్యింది. ఈ–కామర్స్, లాజిస్టిక్స్, మొబిలిటీ సెక్టార్లలో ఫ్రంట్లైన్ వర్కర్ల నియామకాలు ఎక్కువగా జరిగాయి. జూన్, 2020 నుంచి జులై, 2022 మధ్య 28 లక్షల డేటా పాయింట్లను సేకరించామని, వీటి ఆధారంగా రిపోర్ట్ను విడుదల చేశామని బెటర్ప్లేస్ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. ఎకానమీలోని హైరింగ్ యాక్టివిటీ, డిమాండ్, అట్రిషన్ రేటు, వలసలు, శాలరీ, అప్స్కిల్లింగ్ (స్కిల్స్ పెంచుకోవడం) ట్రెండ్స్ను ఈ సంస్థ పరిశీలించింది.
ఐదు రాష్ట్రాల్లో డిమాండ్ ఎక్కువ
- మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలో ఫ్రంట్లైన్ వర్కర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. దేశం మొత్తం మీద నియమితులైన ఫ్రంట్లైన్ వర్కర్లలో 60 శాతం మంది ఈ రాష్ట్రాల్లోనే నియమితులయ్యారు. ఫ్రంట్లైన్ వర్కర్లకు క్రియేట్ అయిన డిమాండ్లో 65 శాతం వాటా ఈ రాష్ట్రాల నుంచే ఉంది. సిటీలను చూస్తే ముంబైలో ఫ్రంట్లైన్ వర్కర్లకు ఎక్కువ డిమాండ్ నెలకొంది.
- ఫ్రంట్లైన్ జాబ్ మార్కెట్లో మగవారి ఆధిపత్యం కొనసాగుతోంది. నియమితులైన వారిలో 97 శాతం మంది మగవారే ఉన్నారు. మహిళల పార్టిసిపేషన్ కేవలం 3 శాతంగానే ఉంది. పని గంటలు ఎక్కువగా ఉండడం, ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం వంటి అంశాలు ఇందుకు కారణం.
- ఫ్రంట్లైన్ వర్కర్లకు ఇచ్చే సగటు మంత్లీ శాలరీ 2020–21 లో రూ.21,664 గా ఉండగా, 2021–22 లో రూ.22,800 పెరిగింది. లాజిస్టిక్స్ సెక్టార్లో ఫ్రంట్లైన్ వర్కర్కు సగటున నెలకు రూ. 26,484 అందుతోంది. ఫైనాన్షియల్ సర్వీసెస్, ఈ–కామర్స్ సెక్టార్లలో ఫ్రంట్లైన్ వర్కర్లకు ఎక్కువ శాలరీ దక్కుతోంది.