ప్రేక్షకులకు ‘ఎవరు’ టీమ్ రిక్వెస్ట్

ప్రేక్షకులకు ‘ఎవరు’ టీమ్ రిక్వెస్ట్

స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా  సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశంతో విడుదలైన  ‘ఎవరు’ మూవీ మంచి హిట్ టాక్ ను తెచ్చుకొంది. ప్రస్తుతం మూవీ టీమ్ ఈ సినిమా సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తోంది. అయితే కొందరు సినిమాలోని కొన్ని సన్నివేశాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారని.. దయచేసి అలా చేయొద్దని హీరో, హీరోయిన్లు కోరారు. అడవి శేష్, నవీన్ చంద్ర, రెజీనా కసాండ్రాలు వీడియో రూపంలో ప్రేక్షకులకు ఒక చిన్న విన్నపం చేశారు.

ఈ సినిమాను చూస్తున్న ప్రేక్షకులు, అభిమానులు చాలా థ్రిల్ కు గురవుతున్నారని, ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లను ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు హీరోహీరోయిన్లు. అదే థ్రిల్..  సినిమాకు వచ్చే ప్రతీ ప్రేక్షకుడు ఎంజాయ్ చేయాలని కోరారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వీడియోల కారణంగా ఆ థ్రిల్ పోతుందని.. చూసే ప్రేక్షకుడికి స్పాయిలర్ లా అనిపిస్తుందని అన్నారు. దయచేసి ఆ వీడియోలను పోస్ట్ చేయొద్దని రిక్వెస్ట్ చేశారు. థియేటర్లో సినిమా చూస్తున్న సమయంలో వీడియో తీయవద్దని కోరారు.