
దండేపల్లి, వెలుగు: ‘మన ఊరు మన బడి’ కింద చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఓ వ్యక్తి స్కూల్కు తాళం వేసి నిరసన తెలిపారు. బీఆర్ఎస్ లీడర్లు అతడికి మద్దతు తెలుపగా.. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు అక్కడికి వచ్చి పోటీగా నినాదాలు చేశారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెల్గనూర్ జడ్పీహెచ్ఎస్ వద్ద బుధవారం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. మన ఊరు, మన బడి, ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ కింద స్కూల్కు వివిధ అభివృద్ధి పనులు మంజూరు కాగా.. ఆ పనులను ఎస్ఎంసీ మాజీ చైర్మన్ గడికొప్పుల విజయ భర్త తిరుపతి పూర్తి చేశాడు. రూ. 20 లక్షల విలువైన పనులు చేయగా.. రూ. 5 లక్షలు మాత్రమే విడుదల అయ్యాయి. దీంతో మిగతా బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం స్కూల్ గేట్కు తాళం వేశాడు. దీంతో స్టూడెంట్లు, టీచర్లు బయటే నిలబడ్డారు.
బీఆర్ఎస్ లీడర్లు స్కూల్కు వద్దకు చేరుకొని తిరుపతికి మద్దతు ప్రకటించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు సైతం స్కూల్కు వద్దకు చేరుకొని పోటీగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, దండేపల్లి ఎస్సై తహసీనొద్దీన్ స్కూల్ వద్దకు చేరుకొని ఇరువర్గాలకు నచ్చజెప్పారు. ఉన్నతాధికారులతో మాట్లాడి బిల్లులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో తాళం తీశారు.