IND vs ENG 2025: సెంచరీతో చెలరేగిన జైశ్వాల్.. భారీ స్కోర్ దిశగా టీమిండియా

IND vs ENG 2025: సెంచరీతో చెలరేగిన జైశ్వాల్.. భారీ స్కోర్ దిశగా టీమిండియా

లీడ్స్ వేదికగా శుక్రవారం (జూన్ 20) ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా ఓపెనర్ జైశ్వాల్ సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ శుభమాన్ గిల్ తో కలిసి జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. 144 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్ తో జైశ్వాల్ తన సెంచరీ మార్క్ అందుకున్నాడు. జైశ్వాల్ కెరీర్ లో ఇది ఐదో సెంచరీ కావడం విశేషం. జైశ్వాల్(100) తో పాటు గిల్ (58) మరో ఎండ్ లో హాఫ్ సెంచరీతో రాణించడంతో తొలి రోజు రెండో సెషన్ ముగిసేసరికీ భారత్ 2 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది.

జైశ్వాల్ సెంచరీతో చెలరేగితే.. గిల్ హాఫ్ సెంచరీ చేశాడు. వీరిద్దరూ మూడో వికెట్ కు అజేయంగా 123 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇంగ్లాండ్ బౌలర్లలో స్టోక్స్, కార్స్ తలో వికెట్ తీసుకున్నారు. 2 వికెట్ల నష్టానికి 92 పరుగులతో రెండో సెషన్ ప్రారంభించిన భారత్ రెండో సెషన్ లో ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. గిల్, జైశ్వాల్ అలవోకగా ఇంగ్లాండ్ బౌలర్లను ఆడేసుకున్నారు. ముఖ్యంగా గిల్ వన్డే ఇన్నింగ్స్ ఆడుతూ ఇంగ్లాండ్ బౌలర్లపై దూకుడు ప్రదర్శించాడు. ఆ తర్వాత జైశ్వాల్ కూడా బౌండరీల వర్షం కురిపించాడు.

ఈ క్రమంలో వీరిద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకోవడంతో పాటు వీరి భాగస్వామ్యం 100కి చేరింది. 49 ఓవర్ చివరి బంతికి కార్స్ బౌలింగ్ లో జైశ్వాల్ సింగిల్ తీసి తన సెంచరీ మార్క్ అందుకున్నాడు. జైశ్వాల్, గిల్ దూకుడుతో రెండో సెషన్ లో ఇంగ్లాండ్ కు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. అంతకముందు రాహుల్ 42 పరుగులు చేసి రాణించగా.. అరంగేట్ర టెస్టులో సాయి సుదర్శన్ డకౌటయ్యాడు.