నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తాం

నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తాం

హిమాచల్ ప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే యవతకు 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ఆప్ హామీ ఇచ్చింది. ఈ లోగా వారికి నెలకు రూ. 3,000 నిరుద్యోగ భృతిని అందిస్తామని తెలిపింది. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లును ఆకట్టుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ 10 ముఖ్యమైన హామీలను ప్రకటించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ సొంత జిల్లాలోని మండిలో నిర్వహించిన బహిరంగ సభలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఈ హామీలను  ప్రకటించారు.

ఢిల్లీ తరహాలో హిమాచల్‌ప్రదేశ్‌ను అవినీతి రహితంగా తీర్చిదిద్దుతామని ఆప్ నేతలు హామీ ఇచ్చారు. సీనియర్ సిటిజన్లు వారి మతపరమైన ప్రదేశాలకు వెళ్లేందుకు ఉచిత తీర్థయాత్ర పథకాన్ని తీసుకువస్తామని చెప్పారు. ప్రతి పంచాయతీ అభివృద్ధికి రూ. 10 లక్షలు గ్రాంట్‌గా అందజేస్తామని, పంచాయతీ అధ్యక్షులకు కూడా నెలవారీ జీతం రూ. 10,000 ఇస్తామని చెప్పారు. 

అంతకుముందు.. హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలో పర్యటించిన ఆప్ నేతలు అనేక హామీలు ఇచ్చారు. ఉచిత విద్య, వైద్యం అందిస్తామని, 18ఏళ్లు పైబడిన మహిళలకు నెలకు రూ.1,000, విధి నిర్వహణలో తమ ప్రాణాలర్పించిన రాష్ట్రానికి చెందిన సైనికుల కుటుంబాలకు రూ. కోటి అందిస్తామని ప్రకటించారు.