
- విమాన ప్రమాదంలో కొనసాగుతున్న డీఎన్ఏ టెస్టింగ్
న్యూఢిల్లీ: ఎయిరిండియా విమాన ప్రమాదంలో చనిపోయిన వారిలో ఇప్పటి వరకూ 220 మందిని డీఎన్ఏ టెస్టుల ద్వారా గుర్తించారు. 202 డెడ్ బాడీలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ విషయాన్ని గుజరాత్ హెల్త్ మినిస్టర్, ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి రుషికేశ్ పటేల్ శుక్రవారం ‘ఎక్స్’ లో తెలిపారు.
‘డీఎన్ఏ టెస్టుల ద్వారా మృతులను గుర్తిస్తున్నాం. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నది. ఇప్పటి వరకూ 220 డీఎన్ఏ నమూనాలు మృతుల బంధువులతో మ్యాచ్ అయ్యాయి. 202 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులు, బంధువులకు అప్పగించాం.
202 మృతదేహాల్లో 160 భారతీయులవి, ఏడు డెడ్ బాడీలు పోర్చుగీసు, 34 బ్రిటిష్ జాతీయులవి. ఒక డెడ్ బాడీ కెనడియన్ ది” అని పటేల్ వివరించారు. 15 మృతదేహాలను విమానంలో తరలించామని, మిగతా 187 బాడీలను రోడ్డు మార్గం ద్వారా పంపించామని ఆయన చెప్పారు. కాగా.. 242 మంది ప్రయాణికులు, సిబ్బందితో అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా 171 విమానం ఈనెల 12న అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలోని మేఘానీ నగర్ లో మెడికల్ కాలేజీ భవనంపై కూలిపోయిన విషయం తెలిసిందే.