
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఫలితంపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఆర్సీబీ, పంజాబ్ జట్లు తలపడుతున్న ఐపీఎల్ సీజన్-18 తుది సమరంలో ఫలితం ఎవరికి అనుకూలంగా ఉంటుందనే విషయంలో జోరుగా బెట్టింగ్స్ నడుస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే ఫలితంపై పుకార్లు షికారు చేస్తున్నాయి. చిలక జోస్యం బ్యాచ్ హడావుడి ఉండనే ఉంది. అయితే.. ఈ మధ్య కాలంలో ఏ సందేహాలున్నా ఏఐని అడగటం అలవాటుగా మారింది.
మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ రిజల్ట్పై ఏమంటున్నాయి..? గూగుల్ ఏఐ అసిస్టెంట్ జెమినీ ఏమంటుంది..? చాట్ జీపీటీ ఫలితం ఎవరికి అనుకూలంగా ఉంది..? ‘ఎక్స్’ అందుబాటులోకి తెచ్చిన ‘గ్రోక్’ ఐపీఎల్ ఫైనల్ రిజల్ట్ విషయంలో ఎవరికి ఓటేసింది..? గ్రోక్, జెమినీ, చాట్ జీపీటీ.. ఈ మూడు ఏఐ టూల్స్ ఏక పక్షంగా గెలుపు అవకాశాలు ఆర్సీబీకే ఎక్కువగా ఉన్నాయని అంచనా వేశాయి. పంజాబ్ కూడా పోటాపోటీగానే ఉన్నా.. ఆర్సీబీదే కొంత పైచేయి అని జెమినీ చెప్పుకొచ్చింది.
ఇక.. చాట్ జీపీటీ అంచనా ఏంటంటే.. ఆర్సీబీ నిలకడైన ఆటతీరుతో పాటు, పంజాబ్ జట్టుపై సాధించిన విజయాలు, క్వాలిఫయర్-1లో ఇదే జట్టును ఓడించడం.. ఈ కారణాల వల్ల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫేవరెట్ టీంగా ఉందని.. విజయావకాశాలు కూడా ఆర్సీబీకే ఎక్కువగా ఉన్నాయని చాట్ జీపీటీ అంచనా వేసింది. ఇక.. ‘గ్రోక్’ చెబుతున్న థియరీ ఏంటంటే.. ఆర్సీబీ టాస్ గెలిస్తే ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని, అందువల్ల బౌలింగ్ విభాగం సరైన ప్రతిభ కనబర్చి పంజాబ్ బ్యాటింగ్ను కట్టడి చేస్తే ఆర్సీబీనే గెలుస్తుందనేది ‘గ్రోక్’ అంచనా. అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్కు స్వర్గధామం. ఫైనల్ ఎర్ర, నల్ల మట్టితో కూడిన సెంటర్ వికెట్పై జరగనుంది.
‘గ్రోక్’ చెప్పినట్టుగా.. 18వ సీజన్లో ఆర్సీబీ సక్సెస్కు ప్రధాన కారణం ఆ టీమ్ సూపర్ బౌలింగ్. ఆసీస్ పేసర్ జోష్ హేజిల్వుడ్ (21 వికెట్లు) ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆఖరాటలో మరిన్ని వికెట్లు తీసి జట్టు కలను నెరవేర్చాలని అతను పట్టుదలగా ఉన్నాడు. యశ్ దయాల్, భువనేశ్వర్ కూడా నిలకడగా రాణిస్తున్నారు. క్వాలిఫయర్–1లో పంజాబ్ మిడిలార్డర్ను దెబ్బకొట్టిన స్పిన్నర్ సుయాశ్ మరోసారి అదే పెర్ఫామెన్స్ రిపీట్ చేయాలని చూస్తున్నాడు. ఇక.. ఇవన్నీ పక్కన పెడితే.. ఈసారి ఆర్సీబీని గెలిపించుకుని ఐపీఎల్ ట్రోఫీని విరాట్ కోహ్లీ చేతుల్లో పెట్టాలని ఆ జట్టు ఆటగాళ్లంతా ధృడ నిశ్చయంతో ఉన్నారు.