
హైదరాబాద్, వెలుగు: కరోనా ట్రీట్మెంట్ ను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తేవాలని, హైకోర్టు చెప్పిన విధంగా విస్తృ తంగా టెస్టులు చేయాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీజేఎస్ఆఫీస్ లో శుక్రవారం టీజేఎస్ , సీపీఐ, సీపీఎం, టీడీపీ, న్యూడెమోక్రసీ, తెలంగాణ ఇంటి పార్టీనేతలు సమావేశమయ్యారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 7న ప్రగతిభవన్ను ముట్టడించిన అఖిలపక్ష నేతలను ప్రభుత్వం దుర్మార్గంగా అరెస్టు చేయించిం దన్నారు. కరోనాతో పని కోల్పోయిన కార్మికులు, చేతి వృత్తులు, చిరు వ్యాపారులు, ఉద్యోగుల ఫ్యామిలీలకు నవంబర్ వరకు నెలకు రూ.7,500, ఫ్రీ రేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. యువతకు నిరుద్యోగ భృతి అమలు చేయాలన్నారు. ఇటీవల తొలగించిన కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను జాబుల్లోకి తీసుకోవాలన్నారు. ప్రైవేట్ సంస్థల్లోని ఉద్యోగులకు జీవో 45 ప్రకారం ఆదాయ భద్రత కల్పించాలని, వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలన్నారు. సీఎం సహాయనిధికి వచ్చిన నిధుల లెక్కలను ప్రకటించాలన్నారు. ఈ మేరకు స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో సీఎం కేసీఆర్ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే 17న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతామన్నారు.