న్యూఢిల్లీ: గూగుల్ పేరెంట్ కంపెనీ అల్ఫాబెట్ కంపెనీ సీఈఓ సుందర్ పిచయ్కు భారీ ప్రోత్సాహకాన్ని ఇవ్వనుంది. కంపెనీ పెర్ఫార్మెన్స్ టార్గెట్లను చేరుకుంటే, వచ్చే మూడేళ్లలో పిచయ్ రూ. 1,704 కోట్ల విలువైన స్టాకులను పొందుతారు. కంపెనీ ఇచ్చే వార్షిక జీతం రూ. 14.2 కోట్లకు ఇది అదనమని కంపెనీ శుక్రవారం ఎక్సేంజ్ ఫైలింగ్లో పేర్కొంది. ఒక వేళ అల్ఫాబెట్ షేర్లు ఎస్ అండ్ పీ 100 ఇండెక్స్ను ఔట్ పెర్ఫార్మెన్స్ చేస్తే సుందర్ పిచయ్ అదనంగా ఇంకో రూ. 639 కోట్లను స్టాక్ గ్రాంట్ రూపంలో అందుకుంటారు. కంపెనీ పెర్ఫార్మెన్స్ ఆధారంగా స్టాక్ అవార్డులను సీఈవోకు ఇవ్వడం ఇదే మొదటిసారి. గూగుల్ కో–ఫౌండర్లు లారీ పేజ్, సెర్జీ బ్రిన్ అల్ఫాబెట్ టాప్ పొజిషన్ల నుంచి వైదొలిగాక, సుందర్ పిచయ్ ఈ నెలలో కంపెనీ సీఈఓ గా బాధ్యతలు తీసుకున్నారు. 2016 లో కూడా ఆయన రూ. 1,420 కోట్ల విలువైన స్టాక్ అవార్డులను అందుకున్నారు. గతేడాది ఆయన అందుకున్న ప్రోత్సాహకాల విలువ రూ. 13.49 కోట్లు.
అంతర్గతంగా వివాదాలు..
సిలికాన్ వ్యాలీలో జీవించేందుకు కొంత మంది గూగుల్ ఉద్యోగులు ఇబ్బందిపడుతుంటే, పిచయ్కి భారీ మొత్తంలో ప్రోత్సాహకాలను ఎలా అందిస్తారని కొంత మంది ఉద్యోగులు మేనెజ్మెంట్ను ప్రశ్నించినట్టు తెలిసింది. కంపెనీ స్టాఫ్ మీటింగ్లో కొంత మంది ఉద్యోగులు తమ వ్యతిరేకతను వెలిబుచ్చారని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. అంతర్గతంగా నిరసనలు పెరిగాక కంపెనీ మేనేజ్మెంట్కు ఉద్యోగులకు మధ్య టెన్షన్లు తీవ్రమయ్యాయి. సుందర్ పిచయ్ ఇండియాలో పుట్టి పెరిగారు. స్టాన్ఫార్డ్ యూనివర్సిటీ, వార్టన్ స్కూల్ యూనివర్సిటీ ఆఫ్ పెన్నిసెల్వేనియా నుంచి డిగ్రి పొందారు. 2004లో గూగుల్లో చేరిన పిచయ్, తక్కువ కాలంలోనే కీలకమైన జీమెయిల్, క్రోమ్ బ్రౌజర్, అండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వంటి పాపులర్ ప్రొడక్స్ట్ డెవెలప్మెంట్లో చురుకైన పాత్ర పోషించారు. ఆల్ఫాబెట్ హోల్డింగ్ కంపెనీని పేజ్, బ్రిన్ 2015 లో క్రియేట్ చేసినప్పుడు, కీలకమైన గూగుల్ సీఈఓ బాధ్యతలను పిచయ్కు ఇచ్చారు. ఈ నెల మూడున పిచయ్ అల్ఫాబెట్ సీఈఓగా బాధ్యతలను అందుకున్నారు. బ్రిన్, పేజ్ ఇద్ధరికి కలిపి గూగుల్లో 6 శాతం వాటా ఉండగా, స్పెషల్ ఓటింగ్ షేర్స్ వలన ఆల్ఫాబెట్ను కంట్రోల్ చేస్తున్నారు. ప్రోత్సాహకాలలో భాగంగా పిచయ్ ఇలాంటి ప్రత్యేక షేర్లను పొందలేదని అల్ఫాబెట్ వర్గాలు తెలిపాయి.