అనుకున్న షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు జరుగుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. జూలై 10 నుంచి కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయని తెలిపారు.కరోనా తీవ్రత దృష్ట్యా తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో పదోవ తరగతి పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనితో ఏపీలో కూడా పది పరీక్షలను రద్దవుతాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మంత్రి సురేష్ పరీక్షల నిర్వహణపై స్పష్టతనిచ్చారు.
జులై 10వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరుగుతాయని ఆయన తెలిపారు. 11 పేపర్లను 6 పేపర్లకు కుదించి పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులను అనవసరమైన ప్రచారాలతో గందరగోళానికి గురిచేయొద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా నేపథ్యంలో భద్రతా చర్యలు పటిష్టంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యం విషయంపై కూడా జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి తెలియజేశారు.