అంగన్​వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి: రవికుమార్

అంగన్​వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి:  రవికుమార్

మహేశ్వరం/మేడిపల్లి, వెలుగు: అంగన్​వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు రవికుమార్ డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలంటూ మహేశ్వరం మండల కేంద్రంలో అంగన్​వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా సోమవారం ర్యాలీ, మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. ఐసీడీఎస్​లో ఏండ్లుగా పనిచేస్తున్న అంగన్​వాడీ టీచర్లు, ఆయాలకు కనీస వేతనం లేదన్నారు.

వారికి పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కార్యక్రమంలో మహేశ్వరం, కందుకూర్, శంషాబాద్ మండలాలకు చెందిన అంగన్​వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు. మేడిపల్లి మండలంలోనూ అంగన్​వాడీలు ఆందోళన చేపట్టగా.. పోలీసులు వారిని  అరెస్ట్ చేసి పీఎస్​కు తరలించారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలోనూ అంగన్​వాడీలు నిరవధిక సమ్మెకు దిగారు. సమస్యలు పరిష్కారం అయ్యేదాకా సమ్మె కొనసాగుతుందని తెలిపారు.