జూ. ఎన్టీఆర్ను ఏపీ సీఎం చెయ్ బాబు : ఎర్రబెల్లి

జూ. ఎన్టీఆర్ను ఏపీ సీఎం చెయ్ బాబు : ఎర్రబెల్లి

చంద్రబాబు నాయుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫెయిల్ అయ్యారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. జూనియర్ ఎన్టీఆర్ను సీఎం చేయాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని.. లోకేష్ను ఆంధ్ర ప్రజలు కోరుకోవడం లేదని చెప్పారు. టీడీపీ చంద్రబాబుది కాదని.. ఎన్టీఆర్ది అని అన్నారు. నమ్మిన ఎన్టీఆర్ను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో కేఏ పాల్, షర్మిల గతే చంద్రబాబుకు పడుతుందన్నారు.

కేంద్రం ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేయాలని చూస్తోందని మంత్రి ఆరోపించారు. మోడీ విధానాలు బడా వ్యాపారులకు దోచిపెట్టేలా ఉన్నాయన్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతు కల్లాలు చేయడం పాపమా అని ప్రశ్నించారు. 150 కోట్లు వసూలు చేసి కేంద్రానికి అప్పజెప్పమనడం సిగ్గుచేటన్నారు. 150 కోట్లు రైతుల వద్ద వసూలు చేసి కేంద్రానికి ఇస్తేనే 11 కోట్ల బకాయిలు విడుదల చేస్తామంటున్నారని చెప్పారు. కేంద్రం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తుందని మండిపడ్డారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో కలిసి పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు.