ఏపీ ప్రభుత్వంపై మరోసారి సంచలన ఆరోపణలు చేసింది ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం. రాష్ట్రంలో తలసారి ఆదాయం బాగా పడిపోయిందని ఆ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది.
ఏపీ విషయంలో విభజన సమస్యలు ఉన్నప్పటికీ గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం ఏపీ తలసరి ఆదాయాన్ని రూ. 93వేల నుంచి రూ.1,64,000కు పెంచింది. సగటున ఏడాదికి రూ.14,000 పెంచుకుంటూ వచ్చిందని టీడీపీ నేతలు ప్రకటిస్తూ వస్తున్నారు. “సీఎం వై ఎస్ జగన్ ప్రధానికి ఇచ్చిన వినతిపత్రంలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1.29 లక్షలు మాత్రమే అని చూపారు.” అంటూ తెలుగుదేశం పార్టీ తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ‘అంటే మొదటి నాలుగు నెలల్లోనే ఏపీ తలసరి ఆదాయం రూ.35 వేలు పడిపోయిందన్న మాట. ఇదంతా రివర్స్ టెండర్ల ముసుగులో ‘రివర్స్ పాలన’ నిర్వాకమన్నమాట.అంటూ ట్విట్టర్లో జగన్ పాలనపై విమర్శలు గుప్పించింది.
ఏపీలో ఆర్థిక సంక్షోభంలో ఉందనే ప్రచారం జరుగుతోంది. కొన్ని బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదంటున్నారు. రుణాలు తిరిగి చెల్లించే స్తోమత సర్కారుకు ఉందా అంటూ ఆర్థిక సంస్థలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి. అప్పులు ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. పారిశ్రామిక, సేవా రంగాలు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాయి. ఈ రంగాల్లో జరిగే వృద్ధి వలన ప్రభుత్వ ఖజానాలోకి అదనంగా పన్నుల రాబడి ఇప్పుడిప్పుడే వచ్చి చేరే అవకాశం లేదు. పరిశ్రమలు, సేవా రంగాలను ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం పలు పన్ను రాయితీలను ఇస్తుండటం ఇందుకు కారణం.
ఆర్థిక సమస్యలతో ఉన్న రాష్ట్రాని గట్టెక్కించాలంటే పాలకులకు సవాలే. ఇలాంటి పరిస్థితులపై మరి సీఎం జగన్ రాష్ట్ర ఆదాయాన్ని, తలసరి ఆదాయం పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

