ఆర్టిజన్లను సర్కారు ఉద్యోగులుగా గుర్తించాలి : రాణిరుద్రమ

ఆర్టిజన్లను సర్కారు ఉద్యోగులుగా గుర్తించాలి : రాణిరుద్రమ
  •  బీఆర్ఎస్ వైఖరితో వారి జీవితాలు మసకబారినయ్ 

హైదరాబాద్, వెలుగు: ఆర్టిజన్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కఠిన వైఖరితో 22 వేల మంది విద్యుత్ ఆర్టిజన్ల కార్మికుల కుటుంబాలు అంధకారంలో మగ్గిపోతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమిస్తే.. ఉప్పు పాతరేనంటూ కార్మికులను కేసీఆర్ సర్కార్ వంచించిందని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని వారి ఆశలను నెరవేర్చలేదని ఆరోపించారు. 

మంగళవారం బీజేపీ స్టేట్​ఆఫీసులో మీడియాతో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖలో పవర్ ప్లాంట్ల నిర్మాణం దగ్గర నుంచి ఉద్యోగుల నియామకం, విద్యుత్ కొనుగోళ్లలో అవినీతిపై విచారణ కొనసాగుతోందన్నారు. విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి టెండర్లు పిలవకుండా ఒప్పందం చేసుకుని ఆర్థిక వనరులను దెబ్బతీసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆమె ఆరోపించారు. 

విద్యుత్ శాఖలో ఆర్థికపరమైన అంశాలు నాణేనికి ఒకవైపైతే, ఉద్యోగుల భవిష్యత్తు మరోవైపు ఉందని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఉద్యోగాలు రాలేదని, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదని.. ఇప్పుడు కాంగ్రెస్ పాలన కూడా అలాగే సాగుతోందని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఆర్టిజన్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, వారి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆమె డిమాండ్ చేశారు.