గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే ఐదేళ్లలో 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఉద్యోగాల కల్పన పూర్తయ్యే వరకు నిరుద్యోగులకు రూ. 3,000 నిరుద్యోగ భృతిని అందజేస్తామని.. నిరుద్యోగ భృతికి సంబంధించి నిధుల కొరత లేదని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పంచాయతీరాజ్ పోస్టులు, ఉపాధ్యాయులు, రాష్ట్ర పోలీసులతో సహా వరుస పరీక్షలను నిర్వహించి రిక్రూట్మెంట్ చేపడతామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని 80 శాతం ప్రైవేటు ఉద్యోగాలు గుజరాత్ ప్రజలకే దక్కుతాయని చెప్పారు. “మేము ఢిల్లీని మార్చాము. మేము పంజాబ్ని మారుస్తున్నాం. ఇప్పుడు గుజరాత్ను మారుస్తాం. ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాది నుంచే ఉద్యోగాల కేటాయింపు ప్రారంభిస్తాం’’ అని కేజ్రీవాల్ తెలిపారు. కాగా గుజరాత్ లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగున్నాయి.