వాజ్‌పేయి వర్ధంతి.. నేతల నివాళులు

వాజ్‌పేయి వర్ధంతి.. నేతల నివాళులు

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి నాలుగో వర్ధంతి సందర్భంగా ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కర్,  హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేడీ నడ్డా సహా పలువురు కేంద్రమంత్రులు ఘనంగా నివాళులు అర్పించారు. వీరితో పాటు వాజ్‌పేయి దత్త కూతురు నమితా కౌల్‌ భట్టాచార్య సైతం ఈ నివాళి కార్యక్రమంలో పాల్గొన్నారు.

దేశ రాజధాని ఢిల్లీలోని వాజ్ పేయి స్మారకం సదైవ్ అటల్ దగ్గరకు చేరుకున్న నేతలు అటల్ బిహారీ వాజ్ పేయికి శ్రద్ధాంజలి ఘటించారు. మహానేతకు నివాళులు అర్పించడానికి బీజేపీ అగ్రనేతలు, ప్రముఖులు ఢిల్లీలోని వాజ్​పేయీ స్మారకం 'సదైవ్​ అటల్'కు తరలివెళ్లారు.
 

వాజ్ పేయి  1924 డిసెంబరు 25న మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో జన్మించారు.

వాజ్ పేయి దేశానికి మూడుసార్లు ప్రధానమంత్రిగా సేవలందించి.. నిస్వార్ధ రాజకీయ నాయకుడిగా అందరి మన్ననలు అందుకున్నారు. 

1996లో 13 రోజులు, 1998,99 కాలంలో 13 నెలలు, 1999 నుంచి 2004 వరకు ఐదేళ్ల పాటు పూర్తికాలం ప్రధానిగా సేవలందించారు. 

అంతకుముందు మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా ప్రభుత్వంలో భారత విదేశాంగ శాఖ మంత్రిగా అటల్ పనిచేశారు. జనతా ప్రభుత్వం కూలిపోయినప్పుడు .. భారతీయ జనసంఘ్ లోని ఇతర సభ్యులతో కలిసి భారతీయ జనతా పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత 15 ఏళ్లపాటు దేశమంతా పర్యటించి పార్టీ విస్తరణలో వాజ్ పేయి కీలక భూమిక పోషించారు. తన రాజకీయ జీవితంలో ఆయన 10 సార్లు లో క్ సభ, 2 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1957లో బలరాంపూర్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా వాజ్ పేయి లోక్ సభకు ఎన్నికయ్యారు.