బంగ్లాదేశ్‌‌, శ్రీలంక మ్యాచ్‌‌ డ్రా

బంగ్లాదేశ్‌‌, శ్రీలంక మ్యాచ్‌‌ డ్రా

గాలె: భారీ వర్షం కారణంగా బంగ్లాదేశ్‌‌, శ్రీలంక మధ్య జరిగిన తొలి టెస్ట్‌‌ డ్రాగా ముగిసింది. దీంతో రెండు మ్యాచ్‌‌ల సిరీస్‌‌ ప్రస్తుతం 0–0తో సమంగా ఉంది. బంగ్లా నిర్దేశించిన 296 రన్స్‌‌ టార్గెట్‌‌ను ఛేదించేందుకు శనివారం ఐదో రోజు బరిలోకి దిగిన లంక రెండో ఇన్నింగ్స్‌‌లో 32 ఓవర్లలో 72/4 స్కోరు చేసింది. ఈ దశలో వర్షం వల్ల ఇన్నింగ్స్‌‌కు అంతరాయం కలిగింది. పాథుమ్‌‌ నిసాంక (24) మెల్లగా ఆడినా లాహిరు ఉడార (9), దినేశ్‌‌ చండిమల్‌‌ (6), మాథ్యూస్‌‌ (8) నిరాశపర్చారు.

కమింద్‌‌ మెండిస్‌‌ (12 నాటౌట్‌‌), ధనంజయ్‌‌ డి సిల్వ (12 నాటౌట్‌‌) ఫర్వాలేదనిపించారు. తైజుల్‌‌ ఇస్లామ్‌‌ 3 వికెట్లు తీశాడు. అంతకుముందు 177/3 ఓవర్‌‌నైట్‌‌ స్కోరుతో ఆట కొనసాగించిన బంగ్లా రెండో ఇన్నింగ్స్‌‌ను 87 ఓవర్లలో 285/6 స్కోరు వద్ద డిక్లేర్‌‌ చేసింది. నజ్ముల్‌‌ శాంటో (125) రెండో సెంచరీ చేయగా, ముష్ఫికర్‌‌ రహీమ్‌‌ (49) మెరుగ్గా ఆడాడు. తరిండు రత్నాయకే మూడు వికెట్లు పడగొట్టాడు. శాంటోకు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.