- 400 కోట్లు అప్పు ఎగవేత
- నాలుగేళ్ల తర్వాత కంప్లైంట్ ఇచ్చిన ఎస్బీఐ
న్యూఢిల్లీ: మరో బడా వ్యాపారవేత్త బ్యాంకులను మోసం చేసి దేశం విడిచి పారిపోయాడు. ఎస్బీఐ సహా ఇతర బ్యాంకులకు మొత్తం 400 కోట్లు ఎగొట్టి విదేశాలకు పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నాలుగు ఏండ్ల తర్వాత ఎస్బీఐ బ్యాంక్ సీబీఐకి కంప్లైంట్ చేసింది. ఢిల్లీకి చెందిన బాస్మతి బియ్యం ఎగుమతిదారులు రామ్దేవ్ ఇంటర్నేషనల్ సంస్థ ఓనర్లు ఈ కేసులో డిఫాల్టర్లుగా ఉన్నారు. ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. 2016 నుంచి ఈ కేసును విచారిస్తుండగా.. వారు అప్పటి నుంచి మిస్సింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఎస్బీఐ డిఫాల్టర్గా కంప్లైంట్ ఇవ్వగా.. ఏప్రిల్ 28న కంపెనీ ఓనర్లు సురేశ్ కుమార్, నరేశ్ కుమార్, సంగీతపై సీబీఐ కేసు నమోదు చేసింది. వాళ్లంతా దుబాయ్ పారిపోయినట్లు తెలుస్తోందని నేషనల్ కంపెనీ లా ట్రైబునల్ (ఎన్సీఎల్టీ) చెప్పింది. డిఫాల్టర్లు మొత్తం రూ. 414 కోట్లు అప్పుడ చేయగా.. ఎస్బీఐ నుంచి రూ.173 కోట్లు, కెనారా బ్యాంక్ నుంచి రూ.76 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.64 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.51 కోట్లు, కార్పొరేట్ బ్యాంక్ రూ.36 కోట్లు, ఐడీబీఐ బ్యాంక్ నుంచి రూ. 12 కోట్లు ఎగ్గొట్టినట్లు తెలుస్తోంది.