
టీమిండియా ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్ కోహ్లీ '18' నెంబర్ జెర్సీ వేసుకోవడం చర్చనీయాంశమైంది. కాంటర్బరీలో ఇండియా ఏ, ఇంగ్లాండ్ లయన్స్ జట్ల మధ్య మధ్య జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ముఖేష్ 18వ నంబర్ జెర్సీ ధరించి మైదానంలోకి నడుచుకుంటూ వచ్చాడు. ముఖేష్ చేసి పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రెండో రోజు ఆటలో భాగంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఈ టీమిండియా పేసర్ 18 నెంబర్ జెర్సీ వేసుకోవడం ఫ్యాన్స్ కు నచ్చలేదు.
ముఖేష్ కుమార్ 18వ నంబర్ జెర్సీ ధరించడంపై వచ్చిన వివాదంపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు మంగళవారం (జూన్ 3) ఎట్టకేలకు స్పందించింది. బీసీసీఐ అధికారి ఒకరు ముఖేష్ ను సమర్ధించింది. ఇప్పుడు ఇండియా ఏ మ్యాచ్లలో ఏ క్రికెటర్కు జెర్సీ నంబర్లు నిర్ణయించబడలేదని ఆయన అన్నారు. బీసీసీఐ అధికారి మాట్లాడుతూ "లయన్స్తో జరిగిన ప్రారంభ 'టెస్ట్' మ్యాచ్లో ముఖేష్ 18వ నంబర్ ధరించాడు. కానీ ఇండియా ఏ జట్టు విషయానికి వస్తే ఎలాంటి జెర్సీలు ధరించాలి అనే ఖచ్చితమైన రూల్ లేదు. ఎవరైనా తమకిష్టమొచ్చిన సంఖ్యను ఎంచుకోవచ్చు. జెర్సీ నంబర్లు అంతర్జాతీయ ఆటలకు మాత్రమే పరిమితం". అని బీసీసీఐ అధికారి అన్నారు.
విరాట్ కోహ్లీ ఇటీవలే టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత, అతని జెర్సీని ఎవరు వేసుకోవడానికి వీలు లేదని బీసీసీఐని నెటిజన్స్ డిమాండ్ చేశారు. కొంతమంది ఎమోషనల్ కాగా.. మరికొందరు ఆగ్రహానికి గురయ్యారు. అభిమానులకు జెర్సీ నంబర్ 18 ఒక ఎమోషన్. అది వేరే వారు ధరిస్తే జీర్ణించుకోలేరు. ఈ జెర్సీ కోహ్లీ పోరాట స్ఫూర్తి, దూకుడు మనస్తత్వం, గొప్పతనం, లాంటి లక్షణాలను సూచిస్తుంది. ముఖేష్ 18వ నంబర్ జెర్సీ ధరించి ఉన్న ఫోటోలు వైరల్ కావడంతో అభిమానులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.