
- సిటీలో కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్నమని ఆరోపిస్తూ వీడియో
- ఏక్యూఐ హానికారక స్థాయిలో ఉందని విమర్శలు
బెంగళూరు: బెంగళూరు సిటీ తమను చంపుతోందని ఓ వ్యాపారవేత్త జంట ఆరోపించారు. సిటీలో కాలుష్యంతో తాము ఉక్కిరిబిక్కిరవుతున్నామని చెప్పారు. అందుకే సిటీ నుంచి వెళ్లిపోతున్నామని పేర్కొన్నారు. అందుకు సంబంధించిన వీడియోను ఆ దంపతులు సోషల్ మీడియాలో పంచుకోగా అది వైరల్గా మారింది. భార్యాభర్తలైన అశ్విన్, అపర్ణ బెంగళూరులో వ్యాపారం చేస్తున్నారు. గత రెండేండ్లుగా ఆ సిటీలో నివసిస్తున్నారు.
అక్కడ వాయుకాలుష్యం ఎక్కువగా ఉందని, గాలి నాణ్యత సరిగ్గా లేదని ఆరోపిస్తూ ఇన్ స్టాగ్రామ్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ‘‘బెంగళూరు నెమ్మదిగా మమ్మల్ని చంపుతోంది. ఎవరు దీనిని చూడటం లేదు. సిటీలో స్వచ్ఛమైన గాలి, గొప్ప వాతావరణం ఉందని అందరు అంటున్నారు. అది నిజమేనా’’ అని వారు ప్రశ్నించారు.
ముందే బయలుదేరే వాళ్లం
బెంగళూరులో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) ప్రమాదకరంగా ఉందని తెలిస్తే ముందే అక్కడ నుంచి బయలుదేరేవాళ్లమని దంపతులైన అశ్విన్, అపర్ణ పేర్కొన్నారు. ‘‘ఫిబ్రవరిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 297గా నమోదైంది. ఇది అనారోగ్యకరం. ప్రమాదకరం. ఏక్యూఐ ఈ స్థాయిలో ఉందని తెలిస్తే ముందే అక్కడ నుంచి బయలుదేరేవాళ్లం.
బెంగళూరు ప్రజలు, వాతావరణం, ఆహారం మాకు ఎంతగానో నచ్చాయి. కానీ, మేం ఏం పీల్చుకుంటున్నామో మాకు తెలియట్లేదు. ఈ సిటీ వ్యాపారం ప్రారంభించడానికి అద్భుతమైన ప్రదేశం. కానీ, ఈ ప్రాంతం మమ్మల్ని చంపేసేలోగానే వీలైనంత త్వరగా ఒక నిర్ణయానికి వచ్చి అక్కడి నుంచి బయలుదేరాల్సి వచ్చింది” అని వెల్లడించారు.
నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు
ఇన్ స్టాగ్రామ్లో వైరల్ గా మారిన ఈ ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి. “నిజం చెప్పినందుకు ధన్యవాదాలు. ఇటువంటి సమస్యనే నేను కూడా ఎదుర్కొన్నా. మూడేండ్ల తర్వాత ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయాను. ప్రస్తుతం నేను సంతోషంగా, ఆరోగ్యకరంగా ఉన్నాను” అని ఒక నెటిజన్ తెలిపారు. ‘‘ఈ విషయం చెప్పినందుకు ప్రజలు మిమ్మల్ని ద్వేషిస్తారు. కానీ, మీరు చెప్పేది 100శాతం నిజం” అని మరో
నెటిజన్ చెప్పారు. ఈ దంపతులు పోస్ట్ చేసిన వీడియోపై బెంగళూరు వాసులు ఫైర్ అయ్యారు.